ముంచెత్తనున్న ఆర్థిక మాంద్యం.. రెసిషన్ టెన్షన్.. అంటూ ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే చర్చ.
అయితే ఈ ఆర్థిక సునామీ నుంచి ఎలా బయటపడొచ్చు. మన జీవితాలను ఇది ఎంతమేర ప్రభావితం చేస్తుందన్న అంశంపై మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు.
ఇంతకీ ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి? దాని ప్రభావం ఎవరిపై ఎంతలా ఉంటుంది? ఈ కష్టం నుంచి గట్టెక్కడం ఎలా? అన్నది తెలుసుకుందాం.
అత్యవసర నిధి
కనీసం 6 నెలలపాటు ఎటువంటి ఆదాయం లేకపోయినా మన అవసరాలు తీరేలా ఓ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఈఎంఐలు, ఇం టి మెయింటెనెన్స్, పిల్లల ఫీజులు, గ్రాసరీ, మెడిసిన్స్ తదితర ఖర్చులకు ఇబ్బంది రాకుండా ఈ నిధి ఉండాలి. ఎప్పుడు అవసరమైనా తక్షణం తీసుకునేలా పెట్టుకోవాలి. మాంద్యం కారణంగా ఉద్యో గం పోయినా, జీతాలు ఆలస్యమైనా ఆదుకునేలా మన ఎమర్జన్సీ ఫండ్ ఉండాలన్నది గుర్తుంచుకోండి.
గత చరిత్ర చూసినా.. అనేకమంది ప్రముఖ ఆర్థికవేత్తల మాటలు విన్నా తెలిసేది ఏమిటంటే.. వరుసగా రెండు త్రైమాసికాల్లో దేశ జీడీపీ వృద్ధిరేటు బలహీనపడిన సందర్భాన్ని ఆర్థిక మాంద్యంగా పరిగణిస్తారు. ఈ సమయంలో వడ్డీరేట్లు భారీగా పెరగడం, నిరుద్యోగం విజృంభించడం, ప్రజల ఆర్థిక-వినీమయ శక్తి సన్నగిల్లడం, ఆందోళనకర ద్రవ్యోల్బణం, కంపెనీల నష్టాలు, స్టాక్ మార్కెట్లు నీరసించడం, కరెన్సీ విలువలు పడిపోవడం, పారిశ్రామికోత్పత్తి తగ్గడం, వాణిజ్య కార్యకలాపాలు మందగించడం వంటివన్నీ ప్రత్యక్షంగా మాంద్యాన్ని సూచిస్తాయి.
ఖర్చుల నియంత్రణ
ఆర్థిక అనిశ్చితి వస్తున్నదని తెలిసినప్పుడు, మాంద్యం ముచ్చెమటలు పట్టించే ప్రమాదం ఉందనే అంచనా ఉన్నప్పుడు మనం ముందు నుంచే జాగ్రత్తపడాలి. ముఖ్యంగా దుబారా ఖర్చులను పూర్తిస్థాయిలో నిలువరించే ప్రయత్నం చేయాలి. మితిమీరిన ఖర్చులపై ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్తూ ‘మనం ఇప్పుడు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో పూట గడవటం కోసం అవసరమైన వాటిని కూడా అమ్ముకోవాల్సి వస్తుంది’ అన్నారు. అందుకే అవసరం ఏదో.. ఆడంబరం ఏదో గుర్తించి జీవించాలి.
కొత్త నైపుణ్యాలతో..
ఎప్పుడో అయిన డిగ్రీ, పీజీ.. నేటి మార్కెట్ అవసరాలకు పనికి రాకపోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు కొత్తకొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా అప్డేట్ అన్నది మరువద్దు. క్లిష్ట పరిస్థితుల్లో మెరుగైన అవకాశాలను అందించేది ఇదేమరి. ఈ మధ్య ఆన్లైన్ కోర్సులు కూడా వస్తున్నాయి. ఐఎస్బీ, ఐఐటీలు సైతం వీటిని ఆఫర్ చేస్తున్నాయి. వీటివల్ల ఉద్యోగుల ప్రమోషన్లకు ఆస్కారం ఉంటుంది.
మరిన్ని ఆదాయ మార్గాలు
ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. రెండు, అంతకుమించి ఆదాయ వనరులు ఉంటేనే ఉత్తమం. ఒకటి ఇబ్బందుల్లో పడినా.. కనీస అవసరాలకు కష్టపడాల్సిన పని ఉండదు. కాబట్టి వ్యాపారం, పార్ట్ టైం ఉద్యోగం, ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా మరే ఇతర పనైనా కావచ్చు.. వీలైనన్ని ఆదాయ మార్గాలను కలిగి ఉండటం మంచిది. అయితే ఆరోగ్యం పాడు చేసుకొనిమరీ సంపాదించనక్కర్లేదు. కుటుంబంలో దంపతులిద్దరూ చెరో పని చేసినా చాలు. పెద్దవారుంటే వారికి తగ్గ పనుల్నీ అన్వేషించాలి. వర్క్ ఫ్రం హోం ఆఫర్లను పరిశీలించండి.
పెట్టుబడులు
పెట్టుబడులు-పొదుపును ఎటువంటి పరి స్థితుల్లోనూ ఆపవద్దు. వాటిని కొనసాగిస్తేనే లాభదాయకం. ముఖ్యం గా స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు మరిన్ని పెట్టుబడులకు మనలో చాలామంది ఆసక్తి కనబర్చరు. అయితే ఇది సరైన వ్యూహం కాదు. వీలైతే రెగ్యులర్ మొత్తం కంటే ఎక్కువ మొత్తాలను దశలవారీగా ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మీ సిప్లను కొనసాగిస్తూనే, అత్యధిక కరెక్షన్స్ వచ్చినప్పుడు అడిషనల్ యూనిట్స్ కొనేందుకు ప్రయత్నించండి. అంతేకానీ ఉన్న మొత్తాన్ని రిడీమ్ మాత్రం చేయొద్దు. అలాగే ప్రతీ ఒక్కరు బీమా, ఆరోగ్య బీమాలకు పెద్దపీట వేయాలి. వీటి ప్రయోజనాల్ని తక్కువగా అంచనా వేయవద్దు.
– నాగేంద్ర సాయి కుందవరం
అప్పులు తగ్గించాలి
రుణ భారం ఎప్పుడైనా తక్కువగా ఉంటేనే మంచిది. అవసరానికి అప్పు తీసుకోవడంలో తప్పేలేదు. కానీ అనవసరంగా దాని జోలికి వెళ్తేనే అసలు సమస్య. దేశం, సంస్థ, వ్యక్తి ఎవరైనా.. ఏదైనాసరే ఆదాయాన్ని మించి అప్పులు చేస్తే సంక్షోభం తప్పదు. పైగా ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను పెంచుతూపోతున్నాయి. భారత్లోనూ అతి తక్కువ కాలంలోనే వడ్డీరేట్లు దాదాపు 2 శాతం పెరిగాయి. వీలైతే.. బోనస్, ఇంక్రిమెంట్లతో హౌజింగ్, పర్సనల్ లోన్లు తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వండి. తాజా వడ్డింపులతో గృహ రుణాల ఈఎంఐలు, కాలపరిమితులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.