న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: అంతరిక్ష రంగం కోసం కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలు.. శాటిలైట్ల తయారీకి ఊతమివ్వగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్టార్టప్ ఎకోసిస్టమ్కు ఇవి కలిసిరాగలవని అభిప్రాయపడుతున్నారు. స్పేస్ రంగంలోని భారతీయ సంస్థలు.. అంతర్జాతీయ కంపెనీలతో జట్టు కట్టేందుకూ మార్గం సుగమమైందని, ఇక నూతన ఆవిష్కరణలు పుంజుకోగలవన్న ఆశాభావాన్నీ వ్యక్తం చేస్తున్నారు. శాటిలైట్ల కోసం విడిభాగాల తయారీలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తూ బుధవారం కేంద్రం ఎఫ్డీఐ నిబంధనల్ని సవరించింది. ఈ రంగంలో విదేశీ సంస్థల్ని, ప్రైవేట్ కంపెనీల్ని ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. కాగా, ఈ మేరకు విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం శాటిలైట్ ఉప రంగాన్ని మూడు విభిన్న కార్యకలాపాలుగా విభజించారు. ఒక్కో రంగంలో విదేశీ పెట్టుబడి కోసం పరిమితులతో కూడిన నిర్వచనాల్నీ చెప్పారు. అయితే అంతరిక్ష రంగంలో శాటిలైట్ తయారీకి సంబంధించి 100 శాతం ఎఫ్డీఐని అనుమతించినా.. ప్రభుత్వం సూచించిన మార్గంలోనే కార్యకలాపాలు సాగాలి. ఈ క్రమంలోనే శాటిలైట్ తయారీ, ఆపరేషన్, శాటిలైట్ డాటా ప్రొడక్ట్స్, గ్రౌండ్, యూజర్ సెగ్మెంట్లలోకి ఆటోమేటిక్ మార్గంలో 74 శాతం వరకు ఎఫ్డీఐకి అనుమతి ఉన్నది. ఈ పరిమితి దాటితే ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి.
ఇక లాంచ్ వెహికిల్స్, అసోసియేటెడ్ సిస్టమ్స్ లేదా సబ్సిస్టమ్స్, స్పేస్క్రాఫ్ట్ రాకపోకల కోసం స్పేస్పోర్ట్స్ నిర్మాణానికి ఆటోమేటిక్ మార్గంలో 49 శాతం వరకు ఎఫ్డీఐని అనుమతిస్తున్నారు. అంతకుమించితే ప్రభుత్వ అంగీకారం కావాల్సిందే. ఇంకా విడిభాగాల తయారీ, శాటిలైట్ల కోసం సిస్టమ్స్/సబ్సిస్టమ్స్, గ్రౌండ్, యూజర్స్ సెగ్మెంట్స్కు ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం వరకు విదేశీ పెట్టుబడులను అనుమతిస్తున్నారు. ‘ఈ కొత్త విధానం.. లాంచ్ వెహికిల్స్, శాటిలైట్ల తయారీ, అసెంబ్లింగ్ కోసం మన స్టార్టప్ ఎకోసిస్టమ్కు తప్పక సహాయపడుతుంది’ అని డెలాయిట్ భాగస్వామి శ్రీరామ్ అనంతశయనం అన్నారు. ఇక విదేశీ సంస్థలతో కలిసి ముందుకెళ్లే అవకాశం భారతీయ సంస్థలకు లభిస్తుందని నంగియా అండర్సన్ ఇండియా రెగ్యులేటరీ డైరెక్టర్ మయాంక్ అరోరా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారతీయ అంతరిక్ష రంగంలో 200లకుపైగా స్టార్టప్లున్నాయని అంచనా. అంతేగాక అంతర్జాతీయ స్పేస్ ఎకానమీలో భారతీయ ప్రైవేట్ స్పేస్ రంగం వాటా దాదాపు 2 శాతంగా ఉన్నది. అయితే 2040 నాటికి ఇది సుమారు 10 శాతానికి చేరగలదన్న అంచనాలున్నాయి.