ముంబై, అక్టోబర్ 19: ఈసారి కూడా ధన్తేరాస్ అమ్మకాలు గత ఏడాది స్థాయిలోనే ఉండొచ్చని నగల వ్యాపారులు అంచ నా వేస్తున్నారు. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన వ్యయాలు ప్రతికూలంగా కనిపిస్తున్నా.. తగ్గుతున్న ధరలతో కొనుగోళ్లు పెరుగుతాయన్న ఆశాభావమే వర్తకుల్లో కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే 2021 మాదిరిగానే 2022 ధన్తేరాస్ సేల్స్ నమోదవుతాయన్న విశ్వాసాన్ని పరిశ్రమ వ్యక్తం చేస్తున్నది. కాగా, దీపావళికి ఒక్కరోజు ముందు ధన్తేరాస్ (ధనత్రయోదశి) వస్తుంది. ఈ నెల 23న ఆదివారం ఈ శుభదినం వస్తుండగా, ఈరోజు బంగారం, వెండి తదితర విలువైన లోహాల కొనుగోళ్లు మంచిదని హిందూ సంప్రదాయ నమ్మకం.
రూపాయితో ఇబ్బంది
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయికి పతనమవుతుండటం.. పసిడి అమ్మకాలను ప్రభావితం చేయవచ్చని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బలహీనపడుతున్న రూపాయి బంగారం ధరల్లో క్షీణతను అడ్డుకుంటుందని వారు అంటున్నారు. స్టాక్, కరెన్సీ మార్కెట్ల నష్టాల మధ్య మదుపరుల పెట్టుబడులు పసిడి వైపునకు వెళ్లే వీలుందని, ఇదే జరిగితే మార్కెట్లో బంగారం ధరలు తిరిగి పెరుగుతాయని, అప్పుడు అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉండబోవని చెప్తున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల నగల పుత్తడి ధర దాదాపు రూ.46,000-47,000 మధ్య కదలాడుతున్నది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,545-1,550 డాలర్లకు వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది స్థాయిలోనే ఈ ఏడాది ధన్తేరాస్ కొనుగోళ్లు ఉండే అవకాశాలున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తుండటం, కరోనాతో వాయిదా పడిన పెండ్లిళ్లు వరుసగా జరగడం నిరుడు పసిడి అమ్మకాలకు కలిసొచ్చింది. దీంతో మళ్లీ 2021లో కరోనాకు ముందున్న స్థాయిలో గోల్డ్ సేల్స్ నమోదయ్యాయి. అయితే అధిక ద్రవ్యోల్బణం, వ్యవసాయంపై అతివృష్టి ప్రభావం, పెరిగిన జీవన వ్యయాలు ఈసారి మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ తగ్గిన ధరలు కొనుగోలుదారులను ఆకర్షిస్తాయనిపిస్తున్నది’
–ఆశిష్ పీతే, అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి చైర్మన్
‘భారత్లో పండుగలు, బంగారం కొనుగోళ్లకు మధ్య బలమైన అనుబంధం ఉంటుంది. ఇక ధన్తేరాస్ వంటి శుభదినాల్లో పసిడి కొనుగోళ్లు మంచిదని మెజారిటీ ప్రజలు భావిస్తారు. ఈ సెంటిమెంట్ మార్కెట్కు కలిసొస్తుంది. అయితే విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం, పెరిగిన వ్యక్తిగత-కుటుంబ ఖర్చులు ఈసారి గోల్డ్ డిమాండ్ను దెబ్బతీసేలా ఉన్నాయి. అయినప్పటికీ గతకొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన ధరలు కొనుగోళ్లకు ఊతమిస్తాయని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా దిగితే ఈ ఏడాదీ ధంతేరాస్ అమ్మకాలు ఆకర్షణీయంగా నమోదయ్యే వీలున్నది.
–సోమసుందరం పీఆర్, ప్రపంచ స్వర్ణ మండలి ప్రాంతీయ సీఈవో