Maruti Suzuki-Red Sea | ఎర్ర సముద్రంలో నెలకొన్న సంక్షోభంపై ప్రముఖ కార్ల తయారీ సంస్థలు మారుతి సుజుకి, ఆడి ఆందోళన వ్యక్తం చేశాయి. తమ కంపెనీల వ్యయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నాయి. ‘ఎర్ర సముద్రంలో సంక్షోభంతో లాజిస్టిక్ సమస్యలు తలెత్తాయి. దీన్ని అధిగమించేందుకు రవాణా మార్గాలను మార్చాలి వస్తుంది. ఎగుమతి-దిగుమతుల్లో సాధారణ ప్రక్రియ. ఎర్ర సముద్రంలో సంక్షోభం వల్ల రవాణా నౌకల రాకపోకల్లో ఆలస్యం వల్ల కార్ల డెలివరీలో జాప్యం జరుగుతుండవచ్చు. కానీ విదేశాలకు ఎగుమతిపై పెద్ద ప్రభావం చూపకపోవచ్చు’ అని మారుతి సుజుకి కార్పొరేట్ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి చెప్పారు.
ఆఫ్రికా ఖండ దేశాల్లో తమ అవకాశాలు మెరుగవుతున్నాయని రాహుల్ భారతి తెలిపారు. వివిధ దేశాలతో కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం వల్ల తమకు సుంకాల నుంచి రిలీఫ్ లభించే అవకాశం ఉందన్నారు. గతేడాది 2.7 లక్షల కార్లను ఎగుమతి చేసిన మారుతి సుజుకి.. వచ్చే పదేండ్లలో 7.5 లక్షల కార్లు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
జర్మనీ కార్ల తయారీ సంస్థ ఆడి కూడా ఎర్ర సముద్రంలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో కార్ల డెలివరీ ఆలస్యం అవుతున్నదని పేర్కొంది. త్వరలోనే పరిస్థితులు చక్కబడవచ్చునని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు భారత్ లోనే విద్యుత్ కార్ల అసెంబ్లింగ్ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు.
ఎర్ర సముద్రం మీదుగా రవాణా అవుతున్న వాణిజ్య నౌకలపై యెమెన్ కేంద్రంగా పని చేస్తున్న హౌతి తిరుగుబాటు దారులు దాడులు చేస్తున్నారు. ఇది ప్రపంచ వాణిజ్య రవాణాకు కీలక ప్రాంతం. హౌతి తిరుగుబాటు దారుల దాడులతో ఎర్ర సముద్రం ప్రాంతంలో తీవ్ర కల్లోలం నెలకొనడంతో పలు నౌకలు తమ రూట్లు మార్చుకుంటున్నాయి. దీంతో రవాణ ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నది.