అభిబస్ కార్యకలాపాల్ని విస్తరిస్తామన్న ట్రావెల్ టెక్ సంస్థ
హైదరాబాద్, జనవరి 5: గతేడాది ఆగస్టులో తాము టేకోవర్ చేసిన హైదరాబాదీ స్టార్టప్ అభిబస్ కార్యకలాపాల్ని మరింతగా విస్తరిస్తామని ట్రావెల్టెక్ కంపెనీ ఎక్సిగో (లి ట్రావెన్యూస్ టెక్నాలజీ) తెలిపింది. బస్ టికెటింగ్ విభాగంలో అభిబస్ ప్లాట్ఫామ్ బాగా ప్రాచుర్యం పొందినందున, ఈ ప్లాట్ఫామ్పై డిజిటల్ చెల్లింపులు అధికంగా హైదరాబాద్లో జరుగుతున్నందున ఈ నగరం తమకు కీలకమైన మార్కెట్గా ఉన్నదని ఎక్సిగో వర్గాలు తెలిపాయి. అభిబస్ హైదరాబాద్ కార్యాలయంలో ప్రస్తుతం 100 మంది సిబ్బంది ఉన్నారని, త్వరలోనే ఈ సంఖ్యను పెంచుతామని, బస్ క్యాటగిరీలో టెక్నాలజీపై మరిన్ని పెట్టుబడులు చేస్తామని ఎక్సిగో వివరించింది. బస్ టికెటింగ్ విభాగంలో అభిబస్.. రెండో పెద్ద ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీగా కొనసాగుతున్నది. 2007లో అలోక్ బాజ్పాయ్, రజనీష్ కుమార్లు ప్రారంభించిన ఎక్సిగో.. రైలు, విమాన టికెటింగ్ మార్కెట్లో గణనీయమైన వాటా సంపాదించింది. రైల్ బుకింగ్లో ఐఆర్సీటీసీకి బీ2సీ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్స్ అయిన ఎక్సిగో ట్రయిన్స్, కన్ఫర్మ్ టికెట్కు కలిసి 42 శాతం వాటా ఉంది. ఆన్లైన్ ఎయిర్వేస్ మార్కెట్లో 2021 ఆర్థిక సంవత్సరంలో ఎక్సిగో 12 శాతం వాటాను సాధించింది. తదుపరి తరం వినియోగదారులు ఎక్కువగా వాయిస్ కమాండ్స్ను వాడనున్నందున, తమ ప్లాట్ఫామ్స్పై మరిన్ని వాయిస్ ఎనేబుల్డ్ ఫీచర్లను ప్రవేశపెడతామని ఎక్సిగో వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను జారీచేయాలన్న యోచనలో ఉన్న ఈ కంపెనీ..ఆఫర్ ద్వారా సమీకరించే నిధుల్లో అధికభాగాన్ని తమ ప్లాట్ఫామ్స్ ప్రచార కార్యక్రమాల కోసం వినియోగించాలని భావిస్తున్నది.