ముంబై, జనవరి 26: ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద బీమా ప్రీమియం చెల్లింపు కోసం ప్రత్యేకంగా కనీసం లక్ష రూపాయల వరకైనా మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని బీమా సంస్థలు కోరుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 80సీ పెట్టుబడుల పరిమితిని పెంచాలని ఇన్సూరర్లు సూచిస్తున్నారు. దీనివల్ల మరింత మందిని బీమా పరిధిలోకి తెచ్చినట్టు అవుతుందని వారు చెప్తున్నారు. ఇతర ఆర్థిక సాధనాలతో పోల్చితే జీవిత బీమా అనేది ఓ దీర్ఘకాలిక పరిష్కారమని, మిగతావన్నీ స్వల్ప పెట్టుబడుల పరిధిలోనే ఉంటాయని పరిశ్రమ వివరిస్తున్నది. ప్రస్తుతం బీమాసహా అన్ని ఆర్థిక సాధనాలను కలిపి సెక్షన్ 80సీలోనే పెట్టారు. దీంతో వీటన్నిటి పెట్టుబడులకు ఐటీ మినహాయింపు పరిమితి రూ.1,50,000లుగానే ఉన్నది. ఈ క్రమంలోనే ఒక్క బీమా ప్రీమియం చెల్లింపులకే లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపును రాబోయే బడ్జెట్లో ఇవ్వాలని ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ విజ్ఞప్తి చేస్తున్నది. బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ వార్షిక నివేదిక 2020-21 ప్రకారం దేశంలో బీమా పాలసీలు జీడీపీలో 4.2 శాతంగా ఉన్నాయి. ప్రపంచ సగటు 7.4 శాతంగా ఉన్నది. గతేడాది మార్చి నాటికి జీవిత బీమాయేతర పాలసీలు ఒక్క శాతంగా ఉన్నాయి.
జీఎస్టీని తగ్గించాలి
ఆరోగ్య బీమాపై ప్రస్తుతం విధిస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను తగ్గించాలని బీమా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. 18 శాతం నుంచి 5 శాతానికి తీసుకురావాలని కోరుతున్నాయి. దీనివల్ల సామాన్యులకు ఆరోగ్య బీమా మరింత చౌకగా లభిస్తుందని చెప్తున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ స్థాయి జీఎస్టీ రేటు భావ్యం కాదని కూడా పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా నిత్యావసరంగా మారిపోయిందని లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రూపం ఆస్తానా అన్నారు.
జీఎస్టీలోకి గ్యాస్ను తేవాలి
జీఎస్టీలోకి సహజ వాయువును కేంద్ర ప్రభుత్వం తప్పక తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని పరిశ్రమ అంటున్నది. గ్యాస్ చోదక ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిలపాలన్న ప్రధాన మంత్రి మోదీ కల సాకారానికీ ఇది దోహదం చేయగలదని అభిప్రాయపడుతున్నది. పర్యావరణ హితానికి కూడా ఈ నిర్ణయం ఊతమివ్వగలదని రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో కూడిన పరిశ్రమ సంఘం అంటున్నది. ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో సహజ వాయువు లేదు. దీనిపై కేంద్ర ఎక్సైజ్ పన్ను, రాష్ర్టాల విలువ ఆధారిత పన్ను, కేంద్ర అమ్మకాల పన్ను పడుతున్నాయి.