హైదరాబాద్, జనవరి 28: హైదరాబాదీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. 2021 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికరలాభం భారీగా 3,648 శాతం జంప్చేసి రూ.706 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇది రూ.19.8 కోట్లు మాత్రమే. ప్రధానంగా కొన్ని ఫార్మా ఉత్పత్తుల విలువ తగ్గడంతో 2020 డిసెంబర్ క్వార్టర్లో రూ.597 కోట్ల ఇంపైర్మెంట్ చార్జీల విధింపుతో అప్పట్లో లాభం తగ్గింది. ఈ చార్జీలు తాజా త్రైమాసికంలో రూ.4.7 కోట్లే. ఫలితంగా ఇప్పుడు నికరలాభంలో భారీ వృద్ధి సాధ్యపడింది. అయితే 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్జించిన రూ.992 కోట్ల లాభంకంటే డిసెంబర్ త్రైమాసికంలో 29 శాతం క్షీణించింది. కాగా సమీక్షా కాలంలో కంపెనీ ఆదాయం రూ. 4,929.6 కోట్ల నుంచి రూ. 5,319 కోట్లకు పెరిగింది. కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేయడంతో అమ్మకాలు పెంచుకోగలిగినట్టు డాక్టర్ రెడ్డీస్ శుక్రవారం తెలిపింది.
భారత్లో ఆదాయం 7 శాతం అప్..
భారత్లో తమ ఆదాయం 7 శాతం వృద్ధిచెంది రూ. 1,036 కోట్లకు పెరిగింది. అమెరికాలో సైతం ఇంతే శాతం వృద్ధితో రూ. 1,864 కోట్లకు చేరింది. ‘క్యూ3లో మేము స్థిరమైన పనితీరును కనపర్చాం. ఈబిటా ఆరోగ్యకరంగా వృద్ధి చెందింది. నగదు రాబడి పటిష్ఠంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ కొత్త ఉత్పత్తులపై పెట్టుబడులు పెడుతున్నాం’
-జీవీ ప్రసాద్, కోచైర్మన్, ఎండీ, డాక్టర్ రెడ్డీస్