న్యూఢిల్లీ: సరిగ్గా ఎనిమిదేండ్ల కిందట లీటర్ పెట్రోల్ ధర రూ.71.41. అక్కడి నుంచి మొదలు ఒకటి, రెండు, మూడు రూపాయాలు అనుకొంటూ సెంచరీ కొట్టింది. ఎనిమిదేండ్లు తిరిగే సరికి లీటర్ పెట్రోల్ రూ.109.66కి చేరింది. సామాన్యులు దొరికారు అన్నట్టు కేంద్రంలోని మోదీ సర్కారు ధరలను పెంచుకొంటూ పోయింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎక్కువున్నాయ్! అనుకొంటే సరే. ఇప్పుడు తగ్గాయ్ కదా! ఇప్పుడైనా తగ్గించండి అంటే.. రాష్ర్టాలే వ్యాట్ తగ్గించుకోవాలని కుంటి సాకులు చెప్తున్నది. పార్లమెంట్ సాక్షిగా నెపాన్ని రాష్ర్టాల మీదికి నెట్టేసింది. పెట్రో ధరలను తగ్గించాలని గురువారం విపక్షాలు లోక్సభలో నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి బీజేపీయేతర రాష్ర్టాలపై నిందలు మోపారు. ‘పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించనిది 6 బీజేపీయేతర రాష్ర్టాలే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, జార్ఖండ్ రాష్ర్టాలు వ్యాట్ను తగ్గించకపోవటం వల్లే పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి’ అని తెలిపారు.
వ్యాట్ను పెంచని తెలంగాణ.. వ్యాట్ను ఎలా తగ్గిస్తుంది? ఎక్సైజ్ సుంకం పెంచి సామాన్యుల నడ్డి విరిచిన కేంద్ర ప్రభుత్వమే కదా! రేట్లు తగ్గించాల్సింది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి గురువారం ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. పెట్రో ధరల బాదుడులో కేంద్రమే అసలు దోషి అని పేర్కొంటున్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 మే 26న పెట్రోల్ రేటు రూ.71.41 కాగా, దీనిపై ఎక్సైజ్ సుంకం రూ.9.48. డీజిల్ ధర రూ.55.49గా ఉండగా, ఎక్సైజ్ సుంకం రూ.3.56గా ఉండేది. ఆ సమయంలో బ్యారెల్ చమురు ధర 108 డాలర్లుగా ఉన్నది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా పడిపోయాయి. ఆ లెక్కన దేశంలో కూడా పెట్రో ధరలు తగ్గాలి. కానీ, కేంద్రం ధరలు తగ్గించడం లేదు. సామాన్యుడికి దక్కాల్సిన ప్రయోజనాన్ని తన జేబులో వేసుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు వ్యాట్ను పెంచనే లేదు. 2015 జనవరి 17న వ్యాట్ (35.2 శాతం) ఎంతైతే ఉన్నదో, ఇప్పుడు కూడా అంతే ఉన్నది.