దేశంలో డిజిటల్ చెల్లింపులు నానాటికీ పెరుగుతున్నా.. అప్పుడో ఇప్పుడో యూపీఐ లావాదేవీల్లో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒకరికి బదులు మరొకరికి నగదు పంపిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఐడీలో పొరపాట్లు కూడా నష్టాలకు దారితీస్తున్నాయి. అయితే ఇతరుల ఖాతాల్లోకి బదిలీ అయిన నగదు మొత్తాలను తిరిగి పొందే అవకాశాలున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. డిజిటల్ సర్వీసుల ద్వారా పొరపాటున లావాదేవీలు జరిగినట్టయితే బాధిత వ్యక్తి తొలుత తాను వినియోగించిన పేమెంట్ సిస్టమ్కు ఫిర్యాదు చేయాలి. గూగుల్ పే, ఫోన్పే లేదా పేటీఎం వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ ద్వారా నగదు బదిలీ అయినట్టయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పోర్టల్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుం ది. ఎవరికైనా నగదు బదిలీతోపాటు కొనుగోళ్లకు సంబంధించి వ్యాపారులకు జరిపిన లావాదేవీల్లో పొరపాట్లపైనా ఫిర్యాదు చేసుకోవచ్చు.
npci.org.in వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో ‘డిస్పూట్ రీఅడ్రెసెల్ మెకానిజం’ ట్యాబ్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘కైంప్లెంట్’ సెక్షన్ను తీసుకోవాలి. అక్కడ ఓ ఆన్లైన్ ఫామ్ ఉంటుంది. ఇందులో పొరపాటు జరిగిన లావాదేవీకి సంబంధించి యూపీఐ ఐడీని పేర్కొనాలి. అలాగే నగదు ఎంత?, లావాదేవీ ఏ తేదీలో జరిగింది, వర్చువల్ పేమెంట్ అడ్రస్, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తదితర వివరాలివ్వాలి. అంతేగాక ఈ లావాదేవీతో మీ ఖాతా నుంచి నగదు తగ్గినట్టు ఓ బ్యాంక్ స్టేట్మెంట్నూ చూపాలి. ఫామ్ దాఖలు చేసేటప్పుడు ఈ ఫిర్యాదుకు కారణంగా ‘మరో ఖాతాకు పొరపాటున నగదు బదిలీ అయ్యింది’ అన్న ఆప్షన్ను తప్పనిసరిగా బాధితులు ఎంచుకోవాలి. అయితే ఈ ఫిర్యాదుతో సమస్య పరిష్కారం కాకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. డిజిటల్ లావాదేవీల కోసం ఆర్బీఐ ఓ సీనియర్ అధికారిని అంబుడ్స్మన్గా నియమిస్తుంది. మీకు ఖాతా ఉన్న బ్యాంక్ పరిధిలోనూ ఉంటారు. ఈ మేరకు బ్యాంక్ శాఖకు వెళ్లి కనుక్కోవచ్చు.