Essential Goods Price | ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రభావం సగటు భారతీయుడిపై భారీగానే పడుతున్నది. వివిధ ఉత్పత్తుల ముడి సరుకు, ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయాయి. ఫలితంగా సబ్బులు, డిటర్జంట్లు, వంట నూనెలు, బిస్కెట్ల ధరలు షాక్ కొడుతున్నాయి. ఇప్పటికే హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) పలు వస్తువులు, సరుకుల ధరలు పెంచేయగా, బ్రిటానియా, పార్లె, డాబర్ ఇండియా వంటి సంస్థలు తమ ఉత్పత్తుల ధరల పెంపునకు సిద్ధంగా ఉన్నాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం పామాయిల్, సోనాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతిపై బాగానే పడింది. సబ్బుల తయారీ సంస్థలన్నీ తమ ఉత్పత్తుల్లో పామాయిల్ వాడతాయి. ఈ నేపథ్యంలో వివిధ రకాల సబ్బులు, డిటర్జెంట్ల ధరలు 3-5 శాతం పెంచేసింది హెచ్యూఎల్. దీని ప్రకారం సర్ఫ్ ఎక్సెల్ డిటర్జంట్ కిలో రూ.130 నుంచి రూ.134లకు పెరిగింది. 100 గ్రాముల 4 లక్స్ సబ్బుల ప్యాక్ 6.60 శాతం పెరిగి రూ.160 పలుకుతున్నది. మూడు పియర్స్ (75 గ్రాముల) ప్యాక్ 5.4 శాతం పెరుగుదలతో రూ.135లకు లభిస్తున్నది.
ఇంకా సర్ఫ్ ఎక్సెల్, వీల్, రిన్ వంటి డిటర్జంట్లతోపాటు డోవ్, హమామ్, రెక్సోనా తదితర సబ్బుల ధరలు కూడా పెరుగనున్నాయి. బ్రూ కాఫీ, టీ పొడి ధరలను కూడా హెచ్యూఎల్ సవరించేసింది. ఇతర వినియోగ వస్తువుల తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ధరలు పెంచనున్నట్లు సంకేతాలిచ్చాయి.
ఇక మ్యారిగోల్డ్, గుడ్ డే వంటి బిస్కెట్ల తయారీ సంస్థ బ్రిటానియా తమ ఉత్పత్తుల ధరలు ఏడు శాతం పెంచుతామని చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం మూడు శాతం ఉండొచ్చునని అంచనా వేసింది బ్రిటానియా. కానీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల అది తొమ్మిది శాతానికి పెరుగుతుందని కంపెనీ ఎండీ వరుణ్ బెర్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫలితంగా వివిధ వస్తువుల తయారీలో ఉపయోగించే ముడి సరుకు ధరలు పెరిగనందున.. ఆయా సరుకుల ధరలు పెంచక తప్పదన్నారు.