Investers Wealth | దేశీయ స్టాక్ మార్కెట్లలో గురువారం రూ.2.95 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. అంతర్జాతీయ అననుకూల పరిస్థితులతో దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు దాదాపు ఒక శాతం నష్టపోయాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 610.37 పాయింట్లు (0.92 శాతం) నష్టపోయి 65,508.32 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకుముందు ఇంట్రా డే ట్రేడింగ్లో 695.3 పాయింట్ల వరకూ పతనమైంది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,16,65,937.80 కోట్ల నుంచి రూ.2,95,144.09 కోట్లకు పడిపోయింది.
ఏషియన్ మార్కెట్లలో షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ లాభాలతో ముగిసింది. టోక్యో, హాంకాంగ్ మార్కెట్లు నష్టపోయాయి. దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లకు గురువారం సెలవు కావడంతో వాటిని మూసివేశారు. యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగిస్తే, అమెరికా స్టాక్ మార్కెట్లలో బుధవారం మిశ్రమ స్పందన కనిపించింది.
గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ ‘బ్రెంట్ క్రూడాయిల్’ 0.38 శాతం నష్టంతో బ్యారెల్ పై 96.18 డాలర్లు పలికింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను రూ.354.35 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. యూఎస్ డాలర్, బాండ్లు పైపైకి దూసుకెళ్తూ ఉంటే.. కిందకు దిగి రావడానికి కొంత సమయం పడుతుందని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
సెన్సెక్స్లో టెక్ మహీంద్రా 4.59 శాతం, ఏషియన్ పెయింట్స్ 3.97 శాతం, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్పోసిస్, ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందూస్థాన్ యూనీ లివర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ తదితర స్టాక్స్ భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.19 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం నస్టాలతో ముగిసాయి. ఐటీ గరిష్టంగా 1.84 శాతం, ఎఫ్ఎంసీజీ 1.74, టెక్ 1.49, కన్జూమర్ డ్యూరబుల్స్ 1.29 శాతం, ఆటో 1.24 శాతం, కమొడిటీస్ 1.21 శాతం నస్టాలతో ముగిశాయి.