EPFO | న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఉద్యోగుల భవిష్యనిధి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్వో) శుభవార్తను అందించింది. వైద్య చికిత్స కోసం వారి ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గతంలో రూ.50 వేలుగా ఉన్న ఈ గరిష్ఠ పరిమితిని రెండింతలు పెంచింది. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్వో ఫారం 31లోని 68 జే కింద అటోమేటిక్గా క్లెయిం చేసుకునే అవకాశం కల్పిస్తూ సర్క్యూలర్ను జారీ చేసింది. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్, గుండెకు సంబంధించిన రోగాలతో ఇబ్బందులు పడుతున్నవారు ఇందుకు అర్హులు. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ ఆమోదం పొందిన తర్వాత ఈ నూతన నిబంధనలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి.
ఫారం 68-జే అంటే…
చికిత్స కోసం ఈపీఎఫ్వో సభ్యుడు ఈపీఎఫ్వో ఫారం 68-జే ద్వారా ముందస్తుగా నగదును ఉపసంహరించుకునే అవకాశాన్ని గతంలోనే కల్పించింది. ఇటీవల కాలంలో చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుండటంతో ఈ భారాన్ని తట్టుకోలేక ఎంతోమంది ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో ఈపీఎఫ్వో ఈ పరిమితిని రెండింతలు పెంచింది. నెల అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారు ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చును.
ఇందుకోసం ఉద్యోగి పలు సర్టిఫికెట్లు, చికిత్సకోసం అయ్యే ఖర్చు వివరాలను పొందుపరుచాల్సి ఉంటుంది. కానీ, వారి ఖాతాలో లక్షకు మించి ఉండాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 68-ఎన్ ప్రకారం వికలాంగులు కొనుగోలు చేసే పరికరాలపై అడ్వాన్స్ రూపంలో విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.