EPFO | ఉద్యోగ భవిష్యనిది సంస్థ (ఈపీఎఫ్వో)లో వాటాదారులు యాజమాన్యాలు.. సబ్స్క్రైబర్లు. ఈపీఎఫ్వోలో సబ్స్క్రైబర్ల మదుపు రూ.2.50 లక్షలు, అంత కంటే ఎక్కువ ఉంటే పన్ను విధిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కానీ, రూ.2.5 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం మీద ఏ ఏడాదిలో పన్ను విధిస్తారన్న విషయమై కేంద్ర ఆర్థిక శాఖ నుంచి గానీ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నుంచి గానీ క్లారిటీ లేదు.
రూ.2.5 లక్షలకు పైగా పీఎఫ్ మదుపుపై వచ్చే వడ్డీ ఆదాయంపై వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే లెవీ వసూలుచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. తర్వాత సీబీడీటీ క్లారిఫికేషన్ ఇస్తూ.. ఈపీఎఫ్ ఖాతాలు గల సబ్స్క్రైబర్లను రెండు భాగాలుగా విభజిస్తామని తెలిపింది.
కానీ మరో 13 రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తుది దశకు చేరుకున్నా.. పీఎఫ్ ఖాతాల విభజనపై స్పష్టత లేదు. ఈపీఎఫ్వో, ట్రస్ట్ల్లో పీఎఫ్ మేనేజింగ్ స్టాఫ్ ఎప్పటి నుంచి పన్ను విధించాలన్న అంశంపై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. రూ.2.5 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం కంట్రిబ్యూషన్ గల పీఎఫ్ సబ్స్క్రైబర్లను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విభజించాల్సిన అవసరం ఉంది.