EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన సబ్స్క్రైబర్ల వ్యక్తిగత వివరాలు వేగంగా సవరించడానికి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. కొందరు సబ్స్క్రైబర్లు.. తమ ఈపీఎఫ్ఓ దరఖాస్తులో ఇచ్చిన సమాచారం, ఆధార్, పాన్ కార్డుల్లో ఉన్న డేటా సమాచారం సరిపోలక పోవచ్చు. ఈ కారణాలతో ఇప్పటి వరకూ ఈపీఎఫ్ క్లయిమ్లను ఈపీఎఫ్ఓ అధికారులు ఇప్పటి వరకు తిరస్కరిస్తూ వస్తున్నారు. ఈ పద్దతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ మేరకు బ్యాంకులకు ఆర్బీఐ జారీచేసిన మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొస్తూ ‘ఈ-కేవైసీ’ అందుబాటులోకి తెచ్చింది. సబ్స్క్రైబర్ ఒకటి కంటే ఎక్కువ సార్లు వ్యక్తిగత సమాచారంలో మార్పులు చేయకుండా కఠిన ఆంక్షలు తెచ్చింది. వ్యక్తిగత సమాచారంలో సవరణల పేరిట మోసాలు జరక్కుండా నియంత్రించడానికి ఈ విధానం తెచ్చినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.
అంతేకాదు సబ్స్క్రైబర్ల వ్యక్తిగత డేటాలో మార్పులకు సమర్పించిన దరఖాస్తులు ఇక నుంచి నెలల తరబడి పెండింగ్లో ఉంచకుండా.. దరఖాస్తుల క్యాటగిరీలను బట్టి చిన్నపాటి సవరణలు వారంలో, భారీ సవరణలు 15 రోజుల్లో పరిష్కరించాలని ఈపీఎఫ్ఓ ఆఫీసులకు గడువు పెట్టింది. ఈ గడువు పాటించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఈపీఎఫ్ ఖాతాలో పర్సనల్ డేటాలో సవరణలకు సబ్స్క్రైబర్లు నిత్యం ఈపీఎఫ్ఓ రీజనల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకుముందు కాగితాల్లో రాసి ఉన్న వివరాలు, డేటా బేస్లో సరిగ్గా నమోదు కాకపోవడం.. ప్రస్తుత ఖాతాలో వివరాలు సరిపోలక.. సబ్స్క్రైబర్ల క్లయిమ్లు తిరస్కరణకు గురవుతున్నాయి.
ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్ డ్రాయల్ చేయాలన్నా, రిటైర్మెంట్ తర్వాత ఫండ్స్ విత్ డ్రా చేసుకోవాలన్నా.. ఆఖరికి పెన్షన్ కోసం దరఖాస్తు చేయాలన్నా.. ఈపీఎఫ్ఓ అధికారులు ఏదో ఒక కారణంతో వాటిని తిరస్కరిస్తున్నారన్న విమర్శలు వస్తు్న్నాయి.
ఈ పరిస్థితుల్లో వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు.. తమ సంస్థ యజమానితో సంతకం చేయించి ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల్లో జాయింట్ డిక్లరేషన్ సమర్పిస్తున్నారు. ఇలా సమర్పించిన దరఖాస్తులపై వెంటనే ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకోకపోవడం, దరఖాస్తు పరిష్కారానికి సరైన గడువు లేక సబ్స్క్రైబర్లు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ సబ్స్క్రైబర్ల సమస్యల పరిష్కారంతోపాటు వారికి పారదర్శక సేవలు అందించడానికి ఈపీఎఫ్ఓ ఈ నూతన పాలసీ తెచ్చింది.