EPFO | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారుల ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) నిల్వలపై వడ్డీరేటు విషయమై కీలక నిర్ణయం తీసుకున్నది. పీఎఫ్ నిల్వలపై 2023-24 ఆర్థిక సంవత్సరం వడ్డీరేటు 8.25 శాతానికి పెంచుతూ శనివారం ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) తీర్మానించింది. గతేడాది కంటే తక్కువగా 8 శాతానికి పీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు తగ్గిస్తారని వచ్చిన వార్తలకు భిన్నంగా ఈపీఎఫ్ఓ-సీబీటీ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇది మూడేండ్ల గరిష్టం.
2022 మార్చిలో సమావేశమైన ఈపీఎఫ్ఓ సీబీటీ.. సబ్ స్క్రైబర్ల ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. ఇది నాలుగు దశాబ్దాల క్రితం కనిష్ట స్థాయి 1977-78లో ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు 8 శాతంగా ఉంది. 2020-21లో పీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు 8.5 శాతం. ఈపీఎఫ్ఓలో ఆరు కోట్ల మంది సబ్స్క్రైబర్లు పని చేస్తున్నారు.
కాగా, గతేడాది మార్చిలో ఈపీఎఫ్ఓ సీబీటీ సమావేశమైనప్పుడు ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు 8.10 శాతం నుంచి 8.15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. తాజాగా శనివారం జరిగిన ఈపీఎఫ్ఓ సీబీటీ సమావేశానికి కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ సీబీటీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు తెలియజేస్తారు. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదించిన తర్వాత అధికారిక గెజిట్ వెలువడుతుంది. అటుపై సబ్ స్క్రైబర్ల ఖాతాల్లో పెరిగిన వడ్డీ మేరకు క్రెడిట్ అవుతుందని ఈపీఎఫ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది.