న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకు వచ్చింది. గతేడాది ఏప్రిల్లో కరోనా మహమ్మారి విశ్వరూపం దాల్చినప్పటి నుంచి సంఘటిత రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల ఈపీఎఫ్వో ఖాతాల్లో పొదుపు చేసిన మొత్తం ఖాళీ అవుతున్నది.
కరోనా విసిరిన సవాల్, సమస్యలతో పలు కంపెనీలు తమ సిబ్బందిని, కార్మికులను పొదుపు చర్యల పేరిట ఇంటికి సాగనంపాయి. కరోనా బారిన పడిన వారి సంగతి చెప్పనవసరమే లేదు. రూ. లక్షల్లో దవాఖాన బిల్లులు చెల్లించాలన్నా.. డబ్బే ప్రధానం..
తమ ఆర్థిక కష్టాలను తీర్చుకోవడానికి కంపెనీలు, సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు.. రిటైర్మెంట్ అవసరాలకు పొదుపు చేసిన పీఎఫ్ సొమ్ము విత్ డ్రా చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి ఈపీఎఫ్వో సభ్యులు లక్షల్లో విత్ డ్రాయల్స్ క్లయిమ్స్ సమర్పించారు. తమ ఖాతాదారుల నాన్-కోవిడ్ క్లెయిమ్ల ప్రక్రియ సమయం తగ్గించడానికి ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) సంచలన నిర్ణయం తీసుకున్నది.
సభ్యుల సౌకర్యార్థం ఈ నాన్-కోవిడ్ క్లెయిమ్స్ను ఆటోమేటిక్గా సెటిల్ చేయడానికి ఈపీఎఫ్వో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కోవిడ్ అండ్ నాన్ కోవిడ్ సంబంధ క్లెయిమ్స్ మాన్యువల్గా ఈపీఎఫ్వో పరిష్కరిస్తున్నది.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈపీఎఫ్వోలో సగానికి పైగా సబ్స్క్రైబర్లు తమ రిటైర్మెంట్ సేవింగ్స్ నుంచి నిధులు విత్ డ్రా చేసుకున్నారు. వాటిలో 72 లక్షల మంది నాన్-రీఫండబుల్ కోవిడ్ అడ్వాన్స్ కోసం క్లెయిమ్స్ చేశారు.
గత ఏడాది ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది మే ఒకటో తేదీ నాటికి ఈవీఎఫ్వో సభ్యులు రూ.18,500 కోట్లు విత్ డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం కోవిడ్ అనుబంధ క్లెయిమ్లు 72 గంటల్లో ఆటోమేటిక్గా, నాన్ కోవిడ్ క్లెయిమ్స్ మాన్యువల్గా పరిష్కరిస్తున్నది ఈపీఎఫ్వో.