EPFO | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో సబ్స్క్రైబర్లుగా ఉన్న వారి డిపాజిట్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేటు ఈ నెల 25,26 తేదీల్లో ఖరారు కానున్నది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్రీ (సీబీటీ) సమావేశం ఈ నెల 25న ప్రారంభం కానున్నది. ప్రస్తుతం ఈపీఎఫ్వోలో ఆరు కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరు కావాలని ఈపీఎఫ్వో వర్గాలు సీబీటీ బోర్డు సభ్యులకు సమాచారం అందజేశాయి. సమావేశం ఎక్కడ జరుగుతుంది, దాని ఏజెండా ఏమిటి అనే అంశాలను ఖరారు చేయలేదు.
అంతర్జాతీయంగా వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్న నేపథ్యంలో సబ్స్క్రైబర్ల డిపాజిట్లపై వడ్డీరేటు 8 శాతం కంటే తగ్గించకపోవచ్చునని అంచనా. గతేడాది మార్చిలో జరిగిన సీబీటీ సమావేశం ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటు నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1 శాతం ఇవ్వాలి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీనికి గత జూన్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది.
మరోవైపు, గరిష్ట పరిమితి కంటే వేతనం పొందుతున్న ఉద్యోగులకు అధిక పెన్షన్ మంజూరు చేయాలని గత నవంబర్ నాలుగో తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై సీబీటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు, యాజమాన్యంతో కలిసి ఈపీఎఫ్వోకు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలి. ఇలా ఉమ్మడి ఆప్షన్ ఇవ్వడంలో అడ్డంకులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించవచ్చునని తెలుస్తున్నది.