ముంబై, సెప్టెంబర్ 2: ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)కు రూ.2.5 లక్షలుపైగా చెల్లించేవారు ఇక నుంచి వేరువేరుగా రెండు ఈపీఎఫ్ ఖాతాల్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పీఎఫ్ ఖాతాల్లో రూ.2.5 లక్షలకుపైబడి జమ అయ్యే మొత్తంపై వడ్డీకి పన్ను విధించనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్లో ప్రవేశపెట్టిన నిబంధన మేరకు ఈ అసెస్మెంట్ సంవత్సరం నుంచి పన్ను ఉంటుంది. అధికంగా పీఎఫ్ జమచేసే వారి ఖాతాలను రెండుగా &ఒక టాక్స్బుల్ పీఎఫ్ ఖాతా, మరో నాన్-టాక్స్బుల్ ఖాతా& విభజించడంవల్ల పన్ను చెల్లింపుదారుకు పన్ను లెక్కింపు సరళతరమవుతుందని సీబీడీటీ తెలిపింది. 2021 మార్చివరకూ పీఎఫ్ ఖాతాల్లో జమ అయిన మొత్తంపై పన్ను ఉండదు. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి రెండు ఖాతాల్లో వడ్డీని వేరువేరుగా వేస్తారు. అంటే గత ఆర్థిక సంవత్సరం వరకూ జమ అయిన మొత్తంపై వచ్చే వడ్డీపై పన్ను ఉండదు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి జమ అయిన మొత్తంపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుంది.