ముంబై, జూన్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. వరుస నష్టాల నుంచి కోలుకుంటూ సోమవారం సూచీలు పుంజుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల మధ్య మంగళవారం మరింతగా పెట్టుబడులు తరలివచ్చాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 934.23 పాయింట్లు లేదా 1.81 శాతం ఎగిసి 52,532.07 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1,201.56 పాయింట్లు ఎగబాకడం విశేషం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 288.65 పాయింట్లు లేదా 1.88 శాతం పెరిగి 15,638.8 వద్ద నిలిచింది.
చమురు షేర్లు ఆకర్షణీయం
చమురు, గ్యాస్ రంగాల షేర్లు మదుపరులను అధికంగా ఆకట్టుకున్నాయి. బీఎస్ఈలో ఇవి 5.96 శాతం లాభపడ్డాయి. ఆ తర్వాత ఎనర్జీ (4.95 శాతం), కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (3.93 శాతం), మెటల్ (3.9 శాతం), రియల్టీ (3.79 శాతం), యుటిలిటీస్ (3.58 శాతం) షేర్లు బలపడ్డాయి. టైటాన్, ఎస్బీఐ, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు ఎక్కువగా లాభాలను సొంతం చేసుకున్నాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 2.42 శాతం, స్మాల్క్యాప్ 2.99 శాతం పుంజుకున్నాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా దేశాల్లో హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో ముగిశాయి. చైనా సూచీ మాత్రం నష్టాలకే పరిమితమైంది. ఇక ఐరోపా మార్కెట్లలోనూ ప్రధానమైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ లాభాల్లోనే కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం సెలవు కావడంతో మూతపడ్డాయి.
మార్కెట్ విలువ పైపైకి
భారీ లాభాలతో ఆయా సంస్థల మార్కెట్ విలువ పరుగులు పెట్టింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.5,77,006.83 కోట్లు ఎగిసింది. ఫలితంగా మొత్తం రూ.2,40,63,930.5 కోట్లను తాకింది. గత వారం మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో మార్కెట్ సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయిన సంగతి విదితమే. 6 రోజుల్లో రూ.18 లక్షల కోట్ల సంపద కరిగిపోయింది. అయితే రెండు రోజులుగా మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేస్తుండటంతో సంపద మళ్లీ పెరుగుతూపోతున్నది.
నష్టాల్లో రూపాయి
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం ట్రేడింగ్లో పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో 15 పైసలు క్షీణించి 78.13 వద్ద స్థిరపడింది. విదేశీ మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణలకే ప్రాధాన్యత ఇస్తుండటం, గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం రూపాయి నష్టాలకు దారితీసింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఎక్కువ కావడం కూడా రూపాయి విలువకు గండికొట్టింది.
సెన్సెక్స్ : 934
నిఫ్టీ : 289
పాయింట్లు