Byju`s- ED Look Out Notice | ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ సంస్థ బైజూ’స్ వ్యవస్థాపకుడు-సీఈఓ బైజూ రవీంద్రన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుక్ఔట్ నోటీసు జారీ చేసింది. ఆయన విదేశీ ప్రయాణానికి వెళితే ముందస్తుగా తమకు సమాచారం ఇవ్వాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (బీఓఐ)ని కోరిందని ఓ ఆంగ్ల దిన పత్రిక వార్తాకథనం ప్రచురించింది. బైజూ రవీంద్రన్ దేశం విడిచి వెళ్లకుండా నివారించేందుకు (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులు ఈ లుక్ఔట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తున్నది. బెంగళూరులోని బైజూ’స్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది ఈడీ. రూ.9,362 కోట్ల లావాదేవీల విషయంలో విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినట్లు బైజూ’స్ మీద ఆరోపణలు ఉన్నాయి.
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న బైజూ’స్.. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏడాదిలోనే రూ.1,82,600 కోట్ల నుంచి రూ.16,600 కోట్లకు పడిపోయినట్లు పలు బ్రోకరేజీ సంస్థలు అంచనా వేశారు. నగదు లభ్యత సమస్యలతో కొన్ని నెలలుగా ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యం సకాలంలో వేతనాలు చెల్లించలేక పోతున్నది.
మరోవైపు రవీంద్రన్ను తొలగించడానికి కొందరు ఇన్వెస్టర్లు.. అసాధారణ స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కొత్త బోర్డు ఏర్పాటు కోసం ఈ నెల 23న ఈ బోర్డు సమావేశం నిర్వహించాలని బైజూ’స్ యాజమాన్యాన్ని కోరారు. దీన్ని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో బైజూ’స్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. బైజూ’స్ అసాధారణ బోర్డు సమావేశానికి అనుమతించినా.. తదుపరి విచారణ వరకు బోర్డు నిర్ణయాలను అమలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. బైజూ’స్ లో ప్రోసస్, పీక్ ఎక్స్ వీ, సోఫినా, జనరల్ అట్లాంటిక్, లైట్ స్పీడ్ సంస్థలు ఇన్వెస్టర్లుగా ఉన్నాయి.