WFH End | కరోనాతో రెండేండ్లుగా వర్క్ ఫ్రం హోంతో సౌకర్యవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు ఐటీ రంగ ఉద్యోగులు.. నిపుణులు. టాప్ ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్హెచ్)కు తెర దించబోతున్నాయి. పలువురు ఉద్యోగులకు ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తుండటంతో ఐటీ దిగ్గజాలు విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర సంస్థల యాజమాన్యాలు వచ్చేనెల నుంచి తమ సిబ్బందిని ఆఫీసులకు రావాలని ఆహ్వానించనున్నాయి.
బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న విప్రో.. వివిధ విభాగాల మేనేజర్లతోపాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, ఉద్యోగులను మార్చి మూడో తేదీ నుంచి ఆఫీసులకు రావాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే వారంలో రెండు రోజులు మాత్రమే ఆఫీసులకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు తెలుస్తున్నది. అలాగే కాగ్నిజెంట్ కూడా ఏప్రిల్ నుంచి స్వచ్ఛందంగా ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరనున్నది. ఈ ఏడాది అంతా హైబ్రీడ్ మోడల్ (ఆఫీస్ ప్లస్ వర్క్ ఫ్రం హోం) విధానంలో ఐటీ సంస్థలు పని చేయనున్నాయి.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే మూడు, నాలుగు నెలల్లో భారీ మొత్తంలో ఉద్యోగులను ఆఫీసులకు ఆహ్వానించనున్నది. టీసీఎస్ కూడా రిమోట్ వర్కింగ్ పాలసీని అమలు చేయబోతున్నది. బేస్ లొకేషన్ నుంచి పని చేయాల్సి ఉంటుంది. అసోసియేట్లు వర్కింగ్ ఫ్రం హోం సేవలందిస్తే, మిగతా వారు ఆఫీసులకు రావాలి. కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పడుతున్నందున పలు కంపెనీలు హైబ్రీడ్ మోడల్ను కొనసాగించాలని భావిస్తున్నాయి. దశల వారీగా ఆఫీసులకు ఆహ్వానించనున్నాయి.
విప్రో ఫ్లెక్సిబుల్, హైబ్రీడ్ విధానాన్ని అమల్లోకి తేనున్నది. ఆ సంస్థ అధికార ప్రతినిధి మాట్లాడుతూ మార్చి మూడో తేదీ నుంచి సంస్థ మేనేజర్లలో పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు వారంలో రెండు (సోమవారం, గురువారం) రోజులు ఆఫీసులకు రావాలన్నారు. ఇతర ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రం హోం విధానంలోనే పని చేస్తారన్నారు.
ఇన్ఫోసిస్లో 96 శాతం మంది వర్క్ ఫ్రం హోం సేవలు కొనసాగిస్తారు. సంస్థ కూడా సిబ్బందిని ఆఫీసులకు రప్పించడానికి తొందర పడటం లేదు. కొవిడ్ కేసుల నేపథ్యంలో హైబ్రీడ్ మోడల్ పని విధానాన్నే కొనసాగిస్తామని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో వ్యాఖ్యానించారు. 40-50 శాతం సిబ్బందిని ఆఫీసులకు రప్పిస్తామన్నారు. దశల వారీగా ఆఫీసులకు సిబ్బందిని తీసుకొస్తామన్నారు.
త్వరలో యువతరాన్ని నియమించుకునేందుకు టీసీఎస్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. భవిష్యత్లోనూ 25-25 శాతం మోడల్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. తొలుత 25/25 శాతం మంది సిబ్బందిని ఆఫీసులకు తీసుకొచ్చి క్రమంగా హైబ్రీడ్ మోడల్కు మళ్లిస్తామని తెలిపారు.
ఇక మరో ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఏప్రిల్ నుంచి ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసులకు రప్పించనున్నది. దశల వారీగా ఆఫీసులకు సిబ్బందిని తీసుకొస్తామని సంస్థ హెచ్ఆర్ ప్రెసిడెంట్ శంతను ఝా చెప్పారు. కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో హైబ్రీడ్ మోడల్ పని విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు.