Air India | గత నవంబర్లో న్యూయార్క్-న్యూఢిల్లీ మధ్య నడుస్తున్న ఎయిర్ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మద్యం మత్తులో మరో ప్రయాణికుడు మూత్రం పోసిన ఘటనపై రచ్చరచ్చ అవుతున్నది. ఈ ఘటనపై ఎయిర్ఇండియా టాప్ ఎగ్జిక్యూటివ్లు, వివిధ విభాగాల అధిపతులకు సమాచారం ఉందని తెలుస్తున్నది. ఈ విషయమై హెడ్ ఆఫ్ ఇన్ఫ్లయిట్ సర్వీస్ డిపార్ట్మెంట్ మొదలు, బేస్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా, లీడ్ హెచ్ఆర్ హెడ్ ఆఫ్ ఐఎఫ్ఎస్డీ, హెడ్ ఆఫ్ నార్త్రన్ రీజియన్ ఆఫ్ ఐఎఫ్ఎస్డీ, క్యాబిన్ క్రూ సూపర్వైజర్, కంప్లయింట్స్ కస్టమర్ కేర్ విభాగాల అధికారులకు ఘటన జరిగిన మరునాడే అంటే 2022 నవంబర్ 27నే సమాచారం అందిందని వారి ఈ-మెయిల్స్ చెబుతున్నాయి.
ఎయిర్ఇండియా చైర్మన్- ఎండీ క్యాంప్బెల్ విల్సన్ మొదలు సంస్థ సీనియర్ మేనేజ్మెంట్కు నవంబర్ 26న జరిగిన సమాచారం తెలుసునని సమాచారం. కానీ సంస్థ అగ్రశ్రేణి నాయకత్వం తమకు వెంటనే ఈ ఘటన సమాచారం అందలేదని వాదిస్తున్నది. మహిళా ప్రయాణికురాలిపై మరో ప్రయాణికుడు మూత్రం పోసినందుకు ఎయిర్ ఇండియాపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. సంబంధిత విమానం పైలట్ లైసెన్స్ సస్పెండ్ చేసింది.
ఎయిర్ ఇండియా ఇన్ఫ్లయిట్ సర్వీసెస్ డైరెక్టర్పై రూ.3 లక్షల ఫైన్ విధిస్తూ శుక్రవారం డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించడానికి ఎయిర్ఇండియా అందుబాటులోకి రాలేదు. పైలట్పై సస్పెన్షన్ వేటు పట్ల పైలట్ల అసోసియేషన్ భగ్గుమన్నది. తమను బలిపశువులను చేస్తున్నారని పేర్కొంది. డీజిసీఏ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. పైలట్పై సస్పెన్షన్ వేటుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది.
ఈ నెల నాలుగో తేదీన మీడియాలో వార్త వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా తీరుపై నిరసన వెల్లువెత్తింది. డీజీసీఏ సైతం తమకు సమాచారం తెలియదని పేర్కొనడం గమనార్హం. ఐఎఫ్ఎస్డీ హెడ్ సందీప్ వర్మకు తొలుత వచ్చిన మెసేజ్కు స్పందిస్తూ.. ఓకే నోట్ చేసుకున్నాం అని రిప్లయ్ ఇచ్చినట్లు సమాచారం. క్యాంప్బెల్ విల్సన్ సైతం మహిళా ప్రయాణికురాలి మేనల్లుడి ద్వారా వచ్చిన ఈ-మెయిల్ను కస్టమర్ కేర్ హెడ్కు ఫార్వర్డ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు మెయిల్స్ సమాచారం చెబుతున్నది.