న్యూయార్క్ : మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను టేకోవర్ చేసిన బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రస్తుతం ఐదు కంపెనీలను నడుపుతూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. తాను రోజంతా పనిచేస్తానని మస్క్ ఇటీవలి ట్వీట్స్లో వెల్లడించారు. రోజంతా పనిచేసి ఇంటికెళ్లి సిమ్యులేటర్పై గడుపుతానని మస్క్ తన తాజా ట్వీట్స్లో పేర్కొన్నారు. మస్క్ ట్విట్టర్ కాకుండా స్పేస్ఎక్స్, ది బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ వంటి నాలుగు కంపెనీలను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ట్విట్టర్ను గాడినపెట్టేందుకే మస్క్ అధిక సమయం వెచ్చిస్తున్నారు.
ట్విట్టర్ 2.0ను లాభాల బాట పట్టించేందుకు తాను రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని మస్క్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కంపెనీ ఉద్యోగులతో కలిసి 24 గంటలూ పనిచేస్తూ సహోద్యోగుల్లో స్ఫూర్తి నింపేలా చొరవ చూపుతున్నారు. కోడింగ్ తెలిసిన టెకీలతో పని రాబట్టుకునేందుకు ఉద్యోగులను ఎక్కువ సమయం కార్యాయాల్లో ఉండే విధంగా ట్విట్టర్ ఆఫీసుల్లో సిబ్బంది కోసం ఏకంగా బెడ్రూమ్స్ ఏర్పాటు చేశారు. రూమ్ల్లో బెడ్, సోఫా, ప్యూరిఫైర్ సహా పలు వసతులను అందుబాటులో ఉంచారు.
ఇక ట్విట్టర్ను టేకోవర్ చేసినప్పటి నుంచి మస్క్ లేఆఫ్స్ మొదలుకుని మైక్రోబ్లాగింగ్ సైట్లో పలు మార్పులు చేపట్టారు. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 50 శాతం ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. అమెరికానే కాకుండా భారత్ సహా పలు దేశాల్లో లేఆఫ్స్ ప్రభావం చూపింది. భారత్లో 170 మంది ఉద్యోగులను ట్విట్టర్ సాగనంపింది. ఇతర టెక్ కంపెనీల తరహాలోనే ట్విట్టర్ సైతం పెద్దసంఖ్యలో ఉద్యోగులను ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే తొలగించింది.