న్యూఢిల్లీ, మే 28: తొలుత తమ కార్లను విక్రయించడానికి, సర్వీస్ చేయడానికి అనుమతిస్తేనే భారత్లో వాహన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అమెరికా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా వ్యవస్థాపకుడు, సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి స్పష్టంచేశారు. ఇక్కడ వాహనాలు విక్రయించడానికి దిగుమతి సుంకాల్ని భారీగా తగ్గించాలంటూ టెస్లా కోరుతున్న సంగతి తెలిసిందే. భారత్లో టెస్లా తయారీ ప్లాంటు ఏర్పాటుపై ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు స్పందనగా ‘మమ్మల్ని తొలుత కార్లు అమ్మడానికి, సర్వీస్ చేయడానికి అనుమతించని ఏ ప్రాంతంలోనూ టెస్లా ఉత్పత్తి ప్లాంట్ నెలకొల్పబోదని’ మస్క్ ట్వీట్ చేశారు.
భారత్లోకి కార్ల దిగుమతుల్ని ప్రారంభించిన తర్వాత మాత్రమే టెస్లా యూనిట్ పెడుతుందంటూ గత ఏడాది ఆగస్టులో సైతం మస్క్ చెప్పారు. భారత్లో తమ కార్లను విడుదల చేయాలని టెస్లా కోరుకుంటున్నదని, అయితే ప్రపంచంలో ఎక్కడా లేనంత అధికంగా ఇక్కడ దిగుమతి సుంకాలు ఉన్నాయన్నారు. 40,000 డాలర్ల ధరకంటే మించి ఉన్న కార్లపై 100 శాతం దిగుమతి సుంకాన్ని, అంతకంటే తక్కువధరగల కార్లపై 60 శాతం దిగుమతి సుంకాన్ని భారత్ విధిస్తున్నది. టెస్లా ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయాలనుకుంటే సమస్య ఏదీ లేదని, చైనా నుంచి మాత్రం కార్లను దిగుమతి చేయకూడదని గతంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.