Maruti Suzuki | వచ్చే 10-15 ఏండ్లలోనూ ఆశించిన ఫలితం ఉండదు
మారుతి సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ
న్యూఢిల్లీ, మార్చి 17: భారత్ వంటి దేశాల్లో విద్యుత్తు ఆధారిత వాహనాలు (ఈవీ) వచ్చే 10-15 ఏండ్లలో కూడా కర్బన ఉద్గారాలను ఆశించిన స్థాయిలో తగ్గించలేవని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. ఐరోపా, అమెరికాలతో పోల్చితే ఇక్కడ తలసరి ఆదాయం భిన్నంగా ఉంటుందన్న ఆయన.. దేశంలో విద్యుదుత్పత్తికి ప్రధాన వనరు బొగ్గేనని గుర్తుచేశారు. అందువల్ల పర్యావరణ హితం కోసం కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ), బయో-సీఎన్జీ, ఇథనాల్, హైబ్రిడ్ వెహికిల్స్ వంటి ప్రత్యామ్నాయ టెక్నాలజీలనూ తప్పక ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదన్నారు. సీఎన్జీ, బయో-సీఎన్జీ, ఇథనాల్పై నడిచే కార్లు, హైబ్రిడ్ వాహనాలు గ్రీన్హౌజ్ వాయువులను తక్కువగా విడుదల చేస్తాయని, దీనివల్ల కాలుష్యం తగ్గడమేగాక.. దేశీయ ఇంధన దిగుమతులనూ తగ్గించుకోవచ్చన్నారు.
పెట్రోల్, డీజిల్ వంటి కాలుష్యకారక ఇంధనాలతో నడిచే కార్లపై, సీఎన్జీ ఆధారిత కార్లపై ఒకే స్థాయిలో పన్ను వేయడంపట్ల ప్రభుత్వ హేతుబద్ధతను భార్గవ ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుతం వాహనాలపై అత్యధికంగా 28 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పడుతున్నది. దీనికి అదనంగా సెస్సునూ విధిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం జీఎస్టీనే వేస్తున్నారు. దీంతో సీఎన్జీ, హైబ్రిడ్ వాహనాల కోసం తక్కువ పన్ను వేయాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయ వ్యర్థాల నుంచి దేశీయంగా బయో-సీఎన్జీని ఉత్పత్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు. 2025 కంటే ముందే ఎలక్ట్రిక్ కార్లు తమ సంస్థ నుంచి వచ్చే వీల్లేదన్నారు.
భారతీయుల తలసరి ఆదాయం తక్కువగా ఉండటం వల్ల ఐరోపా, అమెరికాలతో పోల్చితే ఎక్కువగా ద్విచక్ర వాహనాలనే కొనుగోలు చేస్తారని భార్గవ చెప్పారు. ధర తక్కువగా ఉండే కార్లకే మొగ్గు చూపుతారన్నారు. నిజానికి ఇంధన ఆధారిత వాహనాలతో చూస్తే విద్యుత్తు ఆధారిత వాహనాలే ఖరీదు అన్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ కార్లకు దేశం మారితే ద్విచక్ర వాహనదారులు కార్లను తప్పనిసరిగా కొనాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమా? అని ప్రశ్నించారు. ఈవీ బ్యాటరీల తయారీకి కావాల్సిన లిథియం, కోబాల్ట్ నిల్వలు కూడా దేశంలో లేవని ఈ సందర్భంగా భార్గవ గుర్తుచేశారు. చార్జింగ్ స్టేషన్లను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.