న్యూఢిల్లీ, డిసెంబర్ 7: విద్యుత్తో నడిచే వాహనాలు కూడా టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయమైన ఈవీల వైపు మళ్లుతున్నారు. ఫలితంగా గత నెలలో దేశవ్యాప్తంగా 1,52,626 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. ఏడాది క్రితం అమ్ముడైన 1,21,596 యూనిట్ల కంటే ఇది 25.5 శాతం అధికమని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ సంఘం(ఫాడా) తాజాగా వెల్లడించింది.
వీటిలో ద్విచక్ర వాహన అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 18.82 శాతం పెరిగి 91,243 యూనిట్లకు చేరడం విశేషం. క్రితం ఏడాది ఇది 76,791గా ఉన్నది. అలాగే ఈ-త్రి చక్ర వాహనాలు కూడా 32.27 శాతం ఎగబాకి 40,619 నుంచి 53,766కి చేరుకున్నట్టు ఫాడా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అలాగే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన రిటైల్ సేల్స్ 77 శాతం అధికమై 3,983 యూనిట్ల నుంచి 7,064లకు చేరాయి. 533 యూనిట్ల ఈ-బస్సులు అమ్ముడైనట్టు పేర్కొంది.
హెచ్డీఎఫ్సీతో టాటా జట్టు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో టాటా మోటర్స్ జట్టుకట్టింది. కమర్షియల్ వాహనాలను కొనుగోలు చేసేవారికి ఆర్థిక సేవలు అందించడానికి ఈ ఒప్పందం దోహదం చేయనున్నది. కస్టమర్లకు వినూత్న డిజిటల్ పరిష్కారాల ద్వారా నూతన అనుభవాన్ని కల్పించడానికి వీలు పడనున్నదని టాటా మోటర్స్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ కౌల్ తెలిపారు.