E- Two Wheelers | ఎలక్ట్రిక్ టూ వీలర్స్కు ఫేమ్-2 (Fame-2) సబ్సిడీ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వాటి విక్రయాలపై భారీగానే ప్రభావం చూపింది. గత నెలతో పోలిస్తే జూన్ నెల 15 రోజుల్లో విక్రయాల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్స్ 62.6 శాతం తగ్గిపోయాయి. మరోవైపు ఈ-త్రీ వీలర్స్ సేల్స్ 25.5 శాతం, ఈవీ కార్ల విక్రయాలు 16.1 శాతం వృద్ధి చెందాయి.
కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ఈ-వాహన్ తెలిపిన వివరాల ప్రకారం గత నెలలో ఈ-టూ వీలర్స్ 3,395 అమ్ముడైతే, ఈ నెల 15 రోజుల్లో 1,271 యూనిట్లకు పరిమితం అయ్యాయి. మే నెలలో ద్విచక్ర వాహనాల విక్రయాల్లో ఈ-టూ వీలర్స్ వాటా 7.7 శాతం ఉంటే, ఈ నెలలో 2.6 శాతంతో సరిపెట్టుకున్నది.
ఫేమ్-2 కింద సబ్సిడీలు తగ్గించడంతో అత్యధిక ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కంపెనీలు ఈ నెల మొదటి వారంలో ధరలు పెంచేశాయి. దీనివల్ల పెట్రోల్ వేరియంట్ ద్విచక్ర వాహనాలకు, ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మధ్య ధరల వ్యత్యాసం భారీగా పెరిగింది. తత్ఫలితంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పట్ల కొనుగోలుదారుల అట్రాక్షన్ తగ్గిపోయింది.
వాహనాలు ————— మే ——– జూన్ 15 —- శాతం
ఈ-టూ వీలర్స్ ———- 3395 —— 1271 ——– -62.6
పెట్రోల్ టూ వీలర్స్ —- 44,926 —- 46,756 —- +4.07
మొత్తం టూ వీలర్స్ —- 48,321 —– 48,077 —- -0.61
ఈ- త్రీ వీలర్స్ ———- 1439 ——- 1806 ——- +25.50
ఈవీ కార్స్ ————— 254 ——– 295 ——– + 16.14
ఈ- టూ వీలర్స్ మీద సబ్సిడీ కిలోవాట్కి రూ.15,000 నుంచి రూ.10000కి తగ్గించారు. గరిష్టంగా సబ్సిడీ 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఈ- టూ వీలర్స్ సబ్సిడీ కోసం కేటాయించిన నిధులు ఖర్చయిపోవడం వల్లే కేంద్రం వాటిపై ఇస్తున్న సబ్సిడీ తగ్గించింది.
పది లక్షల మంది పౌరులను లక్ష్యంగా చేసుకుని ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద సబ్సిడీని ప్రకటించింది కేంద్రం. ఈవీ మాన్యుఫాక్చరర్స్ లో ఈ-టూవీలర్స్ కు కేటాయించిన సబ్సిడీ రూ.17 వేల నుంచి రూ.66 వేల కోట్లకు పెరిగింది.
2019లో కేంద్ర ప్రభుత్వం ఐదేండ్ల గడువుతో ఫేమ్-2 స్కీమ్ తీసుకొచ్చింది. ఇది వచ్చే ఏడాది మార్చితో ముగియనున్నది. మొత్తం బడ్జెట్ రూ.10 వేల కోట్లు. దీని ప్రకారం ప్రతిఏటా రూ.2000 కోట్ల చొప్పున కేంద్రం కేటాయించింది. గత ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన బడ్జెట్లో సబ్సిడీ రూ.5,172 కోట్లు కేటాయించగా, రూ.3,889.94 కోట్లు ఖర్చయ్యాయి. గత మార్చి నాలుగో తేదీ నాటికి 9.75 లక్షల ఈ-టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. 2022-23లో 65 శాతం వెహికల్స్ అమ్ముడు పోయాయి. గత ఆర్థిక సంవత్సరం అమ్ముడైన ఈవీల్లో ఈ-టూ వీలర్స్ వాటా 60 శాతం పై చిలుకే. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్రం తొలుత ఫేమ్-1 స్కీం కింద రూ.800 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఫేమ్-2 కింద రూ.10 వేల కోట్ల సబ్సిడీలు అందజేసింది.