Bank Loans on EV | కొవిడ్-19 తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి తోడు కర్బన ఉద్గారాల నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఫేమ్-2 స్కీమ్ అమలు చేస్తున్నది. ఈవీ బైక్లు, స్కూటర్లు, కార్లు కొనుగోలు చేసే వారికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాయితీలు ఇస్తున్నాయి.
సాధారణ కార్లు, బైక్లు, కార్లలో మాదిరిగా రోజువారీగా పెట్రోల్/ డీజిల్ నింపాల్సిన బాధే ఉండదు. ఎలక్ట్రిక్ కార్లు, బైక్లు, స్కూటర్లకు రోజుకోసారి చార్జింగ్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఏ వెహకిల్ అయినా గేర్లతో నడపాల్సిందే. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో గేర్ల ఊసే ఉండదు. ఆటోమేటిక్గా నడిపేయొచ్చు. ఇక సంప్రదాయ కార్లు, బైక్లు, స్కూటర్లు ప్రతి రెండు నెలలకోసారి సర్వీసింగ్ చేయించాలి. విద్యుత్ వాహనాలకు అలా మెయింటెనెన్స్ సమస్య లేదు.
కాకపోతే, ఇతర వెహకిల్స్తో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా పిరం. వాటి తయారీలో సగం ఖర్చు బ్యాటరీలకే పెడుతున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. లిథియం అయాన్ బ్యాటరీతో మాత్రమే వెహికల్స్ పని చేస్తాయి. కనుక విద్యుత్ వాహనాల ధరలు కాసింత ఎక్కువే. దీని కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనుగోలు చేయడానికి వెనకాడుతుంటారు. దీనికితోడు పెట్రోల్, డీజిల్ పంపుల మాదిరిగా దేశవ్యాప్తంగా ఈవీలకు చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపడా లేకపోవడం కూడా ఇబ్బందికర పరిణామమే అని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి దానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉన్నట్లే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇతర ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంకులు కూడా ఈవీ కొనే వారికి తక్కువ వడ్డీరేట్లకు రుణాలివ్వడానికి ముందుకు వస్తున్నాయి. లోన్పై ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలని ఆసక్తితో ఉన్న వారు రుణాలపై ఆయా బ్యాంకులు ఇచ్చే వడ్డీరేట్ ఆప్షన్లు చెక్ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.
వివిధ బ్యాంకుల్లో.. ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అతి తక్కువగా 7.7 శాతం నుంచే రుణాలు ఆఫర్ చేస్తున్నది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.95 % నుంచి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.05, యూనియన్ బ్యాంక్లో 8.2, ఇండియన్ బ్యాంక్లో 8.25, కెనరా బ్యాంకులో 8.3, కర్ణాటక బ్యాంకులో 8.61 శాతంపై ఎలక్ట్రిక్ వెహికల్స్ రుణాలు పొందొచ్చు. అదే పెట్రోల్/ డీజిల్ వాహనాలపై బ్యాంకులు ఇచ్చే రుణాలపై 8.2- 8.71 శాతం వరకు వడ్డీరేట్లు వసూలు చేస్తున్నాయి.