న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: గత కొన్ని నెలలుగా దూసుకుపోయిన కీలక రంగాల్లో మళ్లీ నిస్తేజం ఆవరించింది. ఆగస్టు నెలకుగాను కీలక రంగాల్లో కేవలం 3.3 శాతం వృద్ధి నమోదైంది. ఇది తొమ్మిదినెలల కనిష్ఠ స్థాయి. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన 12.2 శాతంతో పోలిస్తే భారీగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. నవంబర్ 2021లో నమోదైన 3.2 శాతం తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి. జూలై నెలలో 4.5 శాతంగా ఉన్నది. క్రూడాయిల్ ఉత్పత్తి 3.3 శాతం వరకు తగ్గగా, సహజ వాయువు 0.9 శాతం తగ్గాయి. కానీ, ఎరువుల ఉత్పత్తి మాత్రం 11.9 శాతం పెరిగినట్లు తెలిపింది. బొగ్గు ఉత్పత్తి 7.6 శాతానికి, రిఫైనరీ ఉత్పత్తులు 7 శాతానికి, స్టీల్ ప్రొడక్షన్ 2.2 శాతానికి, సిమెంట్ 1.8 శాతానికి, విద్యుత్ ఉత్పత్తి 0.9 శాతానికి తగ్గుముఖం పట్టాయి. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలానికిగాను కీలక రంగాల్లో వృద్ధి 19.4 శాతం నుంచి 9.8 శాతానికి దిగొచ్చింది. ఈ సందర్భంగా ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ మాట్లాడుతూ..విద్యుత్, నిర్మాణ రంగాల్లో నిస్తేజం ఆవరించడంతో కీలక రంగాలపై పడిందని, ముఖ్యంగా భారీ వర్షాలు కూడా ప్రభావం చూపాయన్నారు.