హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): విమానయాన, రక్షణ (ఏరోస్పేస్, డిఫెన్స్) రంగాల్లో తెలంగాణ శరవేగంగా పురోగమిస్తున్నది. కేంద్ర పౌరవిమానయాన శాఖ నుంచి వరుసగా 2018, 2020, 2022 సంవత్సరాల్లో ఉత్తమ రాష్ట్ర అవార్డులను గెలుచుకోవడమే ఇందుకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకంగా ఉన్న ఏరోస్పేస్, రక్షణ రంగాలను మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా ప్రభుత్వం ప్రగతిశీల, సానుకూల విధానాలను అవలంభిస్తూ, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తుండటంతో గత ఏడేండ్లలో పలు దేశ, విదేశీ దిగ్గజ ఏరోస్పేస్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. వీటిలో బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, జీఈ ఏవియేషన్, రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్బిట్ సిస్టమ్స్, శాఫ్రాన్ తదితర ప్రముఖ గ్లోబల్ ఏరోస్పేస్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ (ఓఈఎం) సంస్థలున్నాయి. భారత్కు చెందిన టాటా, అదానీ, కళ్యాణి గ్రూపు లాంటి ప్రముఖ ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలతోపాటు అనుబంధ పరికరాలను తయారుచేసే పలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సైతం రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో టీఎస్ఐఐసీ ఏరోస్పేస్, డిఫెన్స్ పారును నెలకొల్పగా.. రన్వే యాక్సిస్కు అవసరమయ్యే పరికరాల తయారీకి జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏరోస్పేస్ పార్కు ఏర్పాటైంది. ఇటీవల వెమ్ టెక్నాలజీస్ సంస్థ రూ.1,000 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్లోని నిమ్జ్లో సమీకృత రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టింది. భారత్లో ఇంటిగ్రేషన్, టెస్టింగ్ సౌకర్యాలున్న మొదటి సంస్థగా పేరుగాంచింది.
ఏరోస్పేస్, రక్షణ రంగాలకు అవసరమైన పరికరాల తయారీ, పరిశోధనల కోసం నిపుణులైన ఉద్యోగులను తయారు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు కృషి చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిశ్రమలు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లోని విశ్వవిద్యాలయాల భాగస్వామ్యాన్ని తీసుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా అక్కడి క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ హాల్ఫార్డ్, ప్రో వైస్ చాన్స్లర్ పొల్లార్డ్తో సమావేశమై తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఏరోస్పేస్, డిఫెన్స్ వర్సిటీ గురించి వివరించారు. దీన్ని ప్రపంచస్థాయి వర్సిటీగా తీర్చిదిద్దేందుకు తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ వర్సిటీ ఏర్పాటుపై అమెరికా, ఫ్రాన్స్లోని వర్సిటీలతో కూడా చర్చలు జరుగుతున్నాయని, ఇవి త్వరలోనే కొలిక్కి వస్తాయని అధికారులు చెప్తున్నారు.