న్యూఢిల్లీ, మార్చి 6: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్, ముంబైలో ఉన్న సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిపినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. కనీసం 10-12 చోట్ల దాదాపు 15 బృందాలు తనిఖీలు చేసినట్టు చెప్తున్నారు. కాగా, విదేశీ మారకం నిర్వహణ చట్టం (ఫెమా) కింద ఆర్థిక అవకతవకలేగాక, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద బ్యాంక్ మోసం ఆరోపణలపై అనిల్ అంబానీకి చెందిన వివిధ సంస్థలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ విచారణలో భాగంగా అనిల్ అంబానీని ఈడీ అధికారులు రెండుసార్లు ప్రశ్నించిన సంగతి విదితమే. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈడీ ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేసినది తెలిసిందే. మరోవైపు ఈడీ దాడులను రిలయన్స్ పవర్ ఖండించింది. ముంబై, హైదరాబాద్ల్లోని తమ కార్యాలయాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తమ దృష్టికి రాలేదని స్టాక్ ఎక్సేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నది.