భారీ మనీ లాండరింగ్ రాకెట్ బట్టబయలు
దేశవ్యాప్తంగా ఈడీ ముమ్మర సోదాలు
న్యూఢిల్లీ, జూలై 7: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో ఇండియా.. పెద్ద ఎత్తునే పన్నులు ఎగ్గొట్టింది. ఇలా తమ సొంత దేశం చైనాకు ఏకంగా రూ.62,476 కోట్లను అక్రమంగా భారత్ నుంచి తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ప్రకటించింది. అయితే ఈ సొమ్ము తరలిపోయింది ఎప్పుడెప్పుడన్న వివరాల్ని మాత్రం తెలియపర్చలేదు. కానీ ఈ మొత్తం.. వివో టర్నోవర్ రూ.1,25,185 కోట్లలో దాదాపు సగానికి సమానం కావడం గమనార్హం. ఇక ఈ భారీ మనీ లాండరింగ్ రాకెట్లో చైనీయులు, 23 భారతీయ సంస్థల పాత్ర ఉన్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. హాంకాంగ్కు చెందిన మల్టీ ఎకార్డ్ లిమిటెడ్కు అనుబంధ సంస్థగా 2014 ఆగస్టు 1న వివో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. దీనికి అనుసంధానంగా మరో 22 సంస్థలు పుట్టుకొచ్చాయి.
అంతా చైనాకు జంప్
ఈ వ్యవహారంతో సంబంధాలున్న ముగ్గురు చైనీయులు భారత్ నుంచి ఎప్పుడో పారిపోయినట్టు ఈడీ వర్గాలు తెలియజేశాయి. 2018-21 మధ్యే వీరంతా జారుకున్నారు. అయితే మరొకరు భారత్లో 23 సంస్థల్ని ఏర్పాటు చేశారని, నితిన్ గార్గ్ అనే చార్టెడ్ అకౌంటెంట్ ఈ సంస్థలకు సహాయకారిగా కూడా ఉన్నాడని అధికారులు చెప్తున్నారు. కాగా, దేశం విడిచి పారిపోయిన చైనీయుల్లో వివో మాజీ డైరెక్టర్ బిన్ లౌ కూడా ఉన్నారు. లౌ 2018 ఏప్రిల్లో, 2021లో ఝెంగ్షెన్ ఊ, ఝాంగ్ జీ అనే మరో ఇద్దరున్నారు. ఇక వివో ఇండియాకు ఈ 23 సంస్థలు భారీ మొత్తాల్లో నగదును బదిలీ చేశాయని కూడా ఈడీ కనుగొన్నది. తద్వారా ఆయా సంస్థలు చాలా నష్టాల్లో ఉన్నాయని వివో చూపించిందని ఓ ప్రకటనలో చెప్పింది.
48 చోట్ల సోదాలు
దేశవ్యాప్తంగా వివో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలకు చెందిన 48చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ నెల 5న జరిగిన ఈ తనిఖీల్లో 119 బ్యాంకుల్లోని రూ.465 కోట్ల డిపాజిట్లు, రూ.73 లక్షల నగదు, 2 కిలోల బంగారం కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ భారీ మనీలాండరింగ్ రాకెట్ బట్టబయలైంది. గత ఏడాది డిసెంబర్లో వివో అనుబంధ సంస్థ గ్రాండ్ ప్రాస్పెక్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు, భాగస్వాములు, కొందరు నిపుణులపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఈడీ అధ్యయనం చేసింది. తప్పుడు ధ్రువపత్రాలతో,చిరునామాలతో కంపెనీలను ఏర్పా టు చేశారని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫిర్యాదుతో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ను దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 3న పోలీస్ ఎఫ్ఐఆర్కు సమానమైన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును ఈడీ దాఖలు చేసింది.
వ్యాపారంపై ప్రభావం: చైనా
వివోపై ఈడీ దాడులపట్ల చైనా స్పందించింది. భారతీయ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఈ రకంగా తమ సంస్థలపై దర్యాప్తులు చేయడం.. మొత్తం విదేశీ సంస్థల పెట్టుబడుల్నే దెబ్బతీస్తాయని ఇక్కడి చైనా దౌత్యకార్యాలయం అంటున్నది. కాగా, 2020లో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు చోటుచేసుకున్న దగ్గర్నుంచి కేంద్రం చైనా కంపెనీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే 300లకుపైగా చైనా యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. తాజా దాడులపై వివో స్పందిస్తూ.. భారతీయ చట్టాల్ని గౌరవిస్తామన్నది. తాము ఏ తప్పూ చేయలేదని, బాధ్యతాయుతమైన సంస్థగానే ఉంటున్నామన్నది.