న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్బ్యాంక్ నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. తొలుత ఆర్బీఐ నుంచి కావాల్సిన సమాచారం అందుకున్న ఈడీ అధికారులు గురువారం పేటీఎం సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. విదేశాలకు నగదు బదిలీకి సంబంధించిన ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)ను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. అయితే ఫారెక్స్ ఉల్లంఘనలకు పాల్పడలేదని ఇప్పటికే సంస్థ ఖండించినప్పటికీ, ఇందుకు సంబంధించి పేటీఎం సమర్పించిన కొన్ని డాక్యుమెంట్ల ఆధారంగా పేటీఎం ఎగ్జిక్యూటివ్లను ప్రశ్నించారు. మరికొంత సమాచారం కావాలని ఈడీ అధికారులు అడిగారని, ఇప్పటివరకూ అవకతవకలు జరిగినట్టు నిర్దారణ కాలేదని అధికార వర్గాలు వివరించాయి. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్టు తేలితే ఈడీ కేసు రిజిష్టర్ చేస్తుంది.
ప్రివెంన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద పేటీఎం కార్యకలాపాలపై కొద్దికాలంగా దర్యాప్తు జరుగుతున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో పేటీఎం బ్రాండ్ నేమ్తో ఫైనాన్షియల్ సర్వీసెస్ అందింఏ ఒన్97 కమ్యూనికేషన్స్, దాని అనుబంధ బ్యాంకింగ్ సబ్సిడరీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లు పలు నోటీసులు అందుకున్నాయి. ఈ విషయాన్ని పేటీఎం స్టాక్ ఎక్సేంజ్లకు వెల్లడిస్తూ తమ కస్టమర్లు, వారికి సంబంధించిన సంస్థల వివరాలు సమర్పించాలని, వివరణలు ఇవ్వాలంటూ ఈడీతో పాటు ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) నుంచి నోటీసులు వచ్చాయని తెలిపింది. వీటిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని, డాక్యుమెంట్లను అందిస్తున్నట్టు పేటీఎం వివరించింది. మర్చెంట్ ఐడీలను క్రియేట్ చేసుకుని ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ ద్వారా చైనా మొబైల్ ఫోన్ యాప్స్ నిధుల్ని తరలిస్తున్న కేసులో పేటీఎం, ఇతర ఆన్లైన్ పేమెంట్ వాలెట్స్ పై ఈడీ దర్యాప్తు జరుపుతున్నది. అలాగే పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 13 కింద ‘రిపోర్టింగ్ ఎంటిటీ’కి అవసరమైన నిబంధనల్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పాటిస్తున్నదా? లేదా? అనే అంశాన్ని విశ్లేషించి, రిపోర్ట్ చేయాలంటూ ఆర్బీఐని ఎఫ్ఐయూ కోరింది. యాంటీ మనీ లాండరింగ్ చట్టంలోని ఈ సెక్షన్ కింద నిధుల్ని తరలిస్తున్న క్లయింట్లు, ఆ నిధులు అందుకునేవారికి చెందిన లావాదేవీలను, డాక్యుమెంట్లతో పాటు క్లయింట్లకు చెందిన అకౌంట్ ఫైళ్లు, బిజినెస్ కరస్పాండెన్స్ వివరాల్ని ఎఫ్ఐయూకు సంబంధిత ఆర్థిక సంస్థ సమర్పించాల్సి ఉంటుంది.
ఈడీ దర్యాప్తు వార్తల నేపథ్యంలో గురువారం పేటీఎం మాతృసంస్థ ఒన్97 కమ్యూనికేషన్స్ షేరు మరో ఐదు శాతం పతనమయ్యింది. ఎక్సేంజీలు ఈ షేరుకు అనుమతించిన 5 శాతం లోయర్ సర్యూట్ పరిమితి రూ.325 వద్ద ఫ్రీజ్ అయ్యింది. ఈ స్టాక్ లిస్టయిన తర్వాత ఇదే అత్యంత కనిష్ఠస్థాయి. జనవరి 31న ఆర్బీఐ నిషేధం విధించిన తర్వాత ఇప్పటివరకూ ఇది 60 శాతం పడిపోయింది. ఇన్వెస్టర్లు దాదాపు రూ. 27,000 కోట్ల సంపద కోల్పోయారు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంక్ డిపాజిట్లు తీసుకోరాదని, కస్టమర్ ఖాతాలు, వ్యాలెట్లలో టాప్ అప్స్. ఫాస్ట్ట్యాగ్స్, ప్రిపెయిడ్ సాధనాలు ఇవ్వరాదంటూ జనవరి 31న ఆర్బీఐ నిషేధ చర్యల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై తాము ప్రకటించిన చర్యల్ని సమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్దాస్ మూడు రోజుల క్రితమే స్పష్టం చేసినదీ విదితమే.