Religare-ED | ప్రముఖ ఫైనాన్స్ సంస్థ ‘రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్’ మనీ లాండరింగ్కు పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రెలిగేర్ సంస్థకు చెందిన తొమ్మిది ప్రాంతాల్లో శుక్రవారం చేపట్టిన తనిఖీలు శనివారం ముగిశాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. ఈ తనిఖీల్లో రెలిగేర్ సంస్థ రూ.2000 కోట్లకు పైగా నిధులు దారి మళ్లించినట్లు తేలిందని అధికార వర్గాలు చెప్పాయి. రెలిగేర్ సంస్థ అనుబంధ ఆర్ఎఫ్ఎల్, ఎం3ఎం ఇండియా హోల్డింగ్స్, ఆర్హెచ్సీ హోల్డింగ్స్, హిల్ గ్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డియాన్ గ్లోబల్ సొల్యూషన్స్, ప్రియస్ కమర్షియల్ సంస్థల కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించింది.
తమ తనిఖీల్లో రెలిగేర్ కంపెనీ భారీగా అవకతవకలకు పాల్పడిందని తేలిందని, కంపెనీ నేరపూరిత చర్యలు గుర్తించామని ఈడీ వర్గాలు తెలిపాయి. ఆర్థిక అవకతవకలకు సంబంధించి డిజిటల్ ఎవిడెన్స్తోపాటు పలు పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. తమ ప్రస్తుత యాజమాన్యం ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేపట్టాలని ఈడీకి ఫిర్యాదు చేసిందని రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది.
ఫోర్టిస్ మాజీ ప్రమోటర్లు మల్విందర్ మోహన్ సింగ్, శివిందర్ మోహన్ సింగ్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ సీఎండీ సునీల్ గోధ్వానీలపై ఢిల్లీ పోలీసు ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు చేపట్టారు.