న్యూఢిల్లీ, జూలై 30: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, డొల్ల కంపెనీలకు నిధుల్ని మళ్లించిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్) మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా రూ. 110 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో భూములు, భవనాలు, షేర్లు, నగదు, ఆభరణాలు ఉన్నాయి. కేఎస్బీఎల్, దాని చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథి, ఇతరులపై నమోదైన ఈ కేసులో ఇప్పటికే ఈడీ రూ. 1,984.84 కోట్ల ఆస్తుల్ని జప్తుచేయగా, తాజా అటాచ్మెంట్తో ఈ మొత్తం రూ. 2,095 కోట్లకు చేరింది. పార్థసారథి, గ్రూప్ సీఎఫ్ఓ జి.హరికృష్ణలను గతంలో ఈడీ ఆరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరివురూ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. రూ. 2,800 కోట్ల విలువైన ఖాతాదారుల షేర్లను కార్వీ గ్రూప్ తమవేనంటూ చట్టవిరుద్ధంగా తనఖాచేసి బ్యాంకుల నుంచి రుణాలు పొందింది.
ఆ నిధుల్ని దారిమళ్లించి, రుణాల్ని ఎగవేసిన కేసులో హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సెబీ, ఎన్ఎస్ఈల ఆదేశాల మేరకు ఖాతాదారుల షేర్లను విడుదల చేసిన తర్వాత కార్వీ తీసుకున్న రుణాలు మొండి బకాయిలుగా మారాయి. బ్యాంక్ల నుంచి తీసుకున్న రుణాల్ని సీఎండీ, ఇతర అధికారులు..కార్వీ డాటా మేనేజ్మెంట్ సర్వీస్ (కేడీఎంఎస్ఎల్), రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసే క్రిబ్కో ఇన్ఫ్రా తదితర కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అలాగే నకిలీ ఎన్బీఎఫ్సీల ద్వారా కార్వీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రుణాల చెల్లింపునకు మళ్లించినట్టు ఈడీ పేర్కొంది.
పలు నిధుల్ని డొల్ల ఇన్సూరెన్స్ కంపెననీలకు బదిలీచేయగా, ఆ నిధుల్ని కేఎస్బీఎల్ స్టాక్బ్రోకర్గా భారీఎత్తున స్పెక్యులేటివ్ షేర్ట్రేడింగ్ జరిపి తీవ్ర నష్టాల్ని చవిచూసినట్టు ఈడీ వివరించింది. కేఎస్బీఎల్ సబ్సిడరీ కంపెనీల విలువను పెంచుకునేందుకు భారీ నిధుల్ని డొల్ల ఎన్బీఎఫ్సీల ద్వారా పెట్టుబడులు/మూలధనం/స్వల్పకాలిక రుణాల రూపంలో మళ్లించారని, ఇప్పుడా సబ్సిడరీ వ్యాపారాల్ని అధిక విలువకు అమ్ముకోవడానికి నిందితులు ప్రయత్నిస్తున్నారని ఈడీ వివరించింది. పార్ధసారథికి సన్నిహితుడైన కేడీఎంఎస్ఎల్ ఎండీ వి మహేష్ ఈ మనీలాండరింగ్ కార్యకలాపాల్లో చురుగ్గా సహకరించినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఈ కేసులో నిధుల్ని సురక్షితం చేసేందుకు తాజాగా మరో రూ.110.70 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసినట్టు తెలిపింది.