Bhushan Steel | బ్యాంకు ఫ్రాడ్ కేసులో భూషణ్ స్టీల్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, మాజీ ప్రమోటర్ నీరజ్ సింఘాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం అరెస్ట్ చేసింది. ఈ కేసులో నీరజ్ సింఘాల్ ఇంట్లో తనిఖీలు చేసిన తర్వాత ఆయన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని వార్తలొచ్చాయి. రూ.56 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ వ్యవహారంలో సీనియర్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) అధికారులు ఈడీకి ఫిర్యాదు చేశారు. భూషణ్ స్టీల్ యాజమాన్యం, డైరెక్టర్లపై చేసిన ఫిర్యాదుల ఆధారంగా నీరజ్ సింఘాల్పై ఈడీ కేసు దర్యాప్తు ప్రారంభించింది. ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పర్చగా ఈ నెల 20 వరకు ఈడీ కస్టడీ విధించింది.
నీరజ్ సింఘాల్ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి, భూషణ్ స్టీల్ నిధులను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మళ్లించారని ఈడీ ఆరోపించింది. తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేశారని పేర్కొంది. ఆయా డొల్ల కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులను సొంత ఆస్తుల కొనుగోలుకు, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించింది.
జేఎస్ డబ్ల్యూ స్టీల్, హిందూస్థాన్ జింక్ కంపెనీలకు బూటకపు లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇచ్చి బ్యాంకుల నుంచి నిధులను భూషణ్ స్టీల్, ఇతర అనుబంధ కంపెనీలకు ఈడీ అభియోగం. దీనివల్ల ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి నష్టం వాటిల్లిందని ఈడీ ఆందోళన వ్యక్తం చేసింది. భూషణ్ స్టీల్స్ దివాళా ప్రక్రియ దాఖలు చేయడంతో 2018 మేలో ఈ సంస్థను టాటా స్టీల్ టేకోవర్ చేసింది.