Telangana GSDP | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అతి తక్కువ సమయంలోనే ఆర్థిక ప్రగతిలో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. సీఎం కే చంద్రశేఖర్ రావు పటిష్ఠ ప్రణాళికతో ఆర్థికంలో అందనంత ఎత్తుకు ఎదిగినది. ఒక రాష్ట్ర ప్రగతికి జీఎస్డీపీ, తలసరి ఆదాయమే ప్రామాణికం. ఆ రెండింటిలోనూ తెలంగాణకు తిరుగులేదని ఇప్పటికే తేలిపోయింది. తొమ్మిదేండ్లలో జీఎస్డీపీ మూడురెట్లు పెరిగింది. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. దేశంలోని పరిస్థితులపై ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతుంటే.. తెలంగాణ ఆర్థిక ప్రగతిని అందరూ కొనియాడుతున్నారు.
స్థిరమైన వృద్ధితో..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి జీఎస్డీపీ స్థిరంగా పెరుగుతూనే ఉన్నది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ రూ.4,51,580 కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇది రూ.12,93, 469 కోట్లకు ఎగబాకింది. అంటే, తొమ్మిదేండ్లలోనే జీఎస్డీపీ మూడు రెట్లు పెరిగింది. గణనీయంగా 186 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.2022-23లో దేశ జీడీపీ రూ.2,72,03,767 కోట్లు కాగా దీంట్లో తెలంగాణ వాటా 4.7 శాతం. 2020-21లో ఒకవైపు కరోనా కాటేస్తున్నా, కేంద్రం ఏకాణా ఇవ్వకున్నా తెలంగాణ మాత్రం వెనుదిరిగి చూడలేదు. ఆ సమయంలో దేశ జీడీపీ -1.4 శాతానికి పడిపోగా, తెలంగాణ మాత్రం 1.2 వృద్ధిరేటును నమోదు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.