న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దేశంలో టాప్-50 ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల నుంచి బ్యాంక్లకు దాదాపు రూ. లక్ష కోట్లు రావాల్సి ఉంది. 2022 మార్చి 31 నాటికి బ్యాంకులకు 50 మంది వ్యక్తులు, సంస్థలు కలిసి బ్యాంక్లకు రూ.92,570 కోట్ల రుణాల్ని ఉద్దేశపూర్వకంగా ఎగవేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కారద్ లోక్సభకు చెప్పారు. బుధవారం మంత్రి ఒక లిఖితపూర్వక ప్రశ్నకు బదులిస్తూ దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ ఎగవేతదారుల జాబితాలో అగ్రస్థానంలో ఉందన్నారు. గీతాంజలి జెమ్స్ రూ.7,448 కోట్ల విలువైన రుణాల్ని ఎగ్గొట్టింది.
రిజర్వ్బ్యాంక్ గణాంకాల్ని మంత్రి ఉటంకిస్తూ రూ.5,879 కోట్ల రుణాల్ని ఎగవేసిన ఎరా ఇన్ఫ్రా ద్వితీయస్థానంలోనూ, రీగో ఆగ్రో (రూ.4,806 కోట్లు) తృతీయస్థానంలోనూ ఉన్నట్టు తెలిపారు. తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లించాల్సి ఉన్నా, చెల్లింపు చేయని రుణగ్రస్తుల్ని ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పరిగణిస్తారు. ఈ రుణగ్రస్తులకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఎటువంటి సదుపాయాలు అందకుండా నిషేధిస్తారు. కాంకాస్ట్ స్టీల్ అండ్ పవర్, ఏబీజీ షిప్యార్డ్, ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్, విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెల్లరీ, రోటోమాక్ గ్లోబల్, కోస్టల్ ప్రాజెక్ట్స్, జూమ్ డెవలపర్స్ తదితర కంపెనీలు జాబితాలో ఉన్నాయి.
డిఫాల్టర్లపై చర్యలు
డిఫాల్టర్టపై చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రుణ మొత్తాల్ని రికవరీ చేసే చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఫిర్యాదు ఆధారంగా గత వారం మెహుల్ చోక్సీపై సీబీఐ మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. మెహుల్ చోక్సీ, ఇతరులు కలిసి పీఎన్బీ నేతృత్వంలోని మూడు సభ్య బ్యాంక్లకు ఉద్దేశపూర్వకంగా
నష్టం కల్గించినట్టు మూడు ఎఫ్ఐఆర్ల్లో పేర్కొన్నారు. గీతాంజలి జెమ్స్ డైరెక్టర్లు శివరామన్ నాయర్, ధనేష్ సేథ్లతో పాటు కొంతమంది ప్రభుత్వాధికారులను ఈ ఎఫ్ఐఆర్ల్లో చేర్చారు.
రూ.10 లక్షల కోట్లు రైటాఫ్
బ్యాంక్లు రూ.10.1 లక్షల కోట్ల రుణాల్ని రైటాఫ్ చేశాయని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి కారద్ తెలిపారు. రుణాల్ని రైటాఫ్ చేసిన బ్యాంక్ల జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటిస్థానంలో ఉంది. ఈ బ్యాంక్ రూ. 2 లక్షల కోట్ల రుణాల్ని రైటాఫ్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 67,214 కోట్ల రుణాల్ని ఖాతా పుస్తకాల నుంచి తొలగించగా, ప్రైవేటు రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంక్ రూ.50,514 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 34,782 కోట్ల చొప్పున రైటాఫ్ చేశాయి.