Festival Sales | పండుగల సీజన్లో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ వివిధ ఉత్పత్తుల విక్రయంపై ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించిన నేపథ్యంలో భారీ అమ్మకాలు జరుగుతున్నాయి. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్కార్ట్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట అమెజాన్, మెగా బ్లాక్ బస్టర్ పేరుతో మీషో ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 22వ తేదీ నుంచి 25 వరకు కేవలం నాలుగు రోజుల్లోనే రూ.24,500 కోట్ల విలువైన వస్తువుల అమ్మకాలు జరిగాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ రెడ్సీర్ పేర్కొంది. నాలుగు రోజుల్లో రూ.11 వేల కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోగా, సగటున నిమిషానికి 1100 ఫోన్ల విక్రయాలు సాగాయని తేల్చి చెప్పింది. దీని ప్రకారం సెకన్కు 18కి పైగా ఫోన్ల అమ్మకాలు జరిగాయి. మొత్తం 60-70 లక్షల ఫోన్ల సేల్స్ జరిగాయని వివరించింది. ఇది గతేడాదితో పోలిస్తే 28 శాతం ఎక్కువ. తొలి వారంలో 90 లక్షల నుంచి కోటి స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా వేసింది.
ఈ ఆఫర్లు దీపావళి వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. అయితే, తొలి విడుత సేల్లోనే 50 శాతం ఉత్పత్తుల విక్రయాలు సాగుతుంటాయి. అలా గణిస్తే ఈ ఏడాది తొలి నాలుగు రోజుల్లో 1.3 రెట్లు ఎక్కువగా సేల్స్ జరిగాయని రెడ్ సీర్ పేర్కొన్నది.
ఫస్ట్ ఫేజ్ సేల్స్లో రూ.41 వేల కోట్ల విలువైన ఉత్పత్తులు అమ్ముడవుతాయని అంచనా వేయగా, నాలుగు రోజుల్లోనే 60 శాతం విక్రయాలు జరిగాయని రెడ్సీర్ పార్టనర్ సంజయ్ కొఠారీ తెలిపారు. మింత్రా, అజియో, నైకా వంటి సంస్థలు కూడా వినియోగదారులకు పలు ఆఫర్లు ప్రకటించాయి.
తొలి నాలుగు రోజుల్లో ఐఫోన్-12, ఐఫోన్-13, వన్ ప్లస్ వంటి స్మార్ట్ ఫోన్లకు ఫుల్ గిరాకీ ఉంది. పండుగల సీజన్ కావడంతో వినియోగదారులు ఫ్యాషన్ ఉత్పత్తుల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తొలి నాలుగేండ్లలో రూ.5,500 కోట్ల ఫ్యాషన్ వస్తువుల కొనుగోళ్లు జరిగాయి. రోజువారీ సేల్స్తో పోలిస్తే 4.5 రెట్లు ఎక్కువ.