హైదరాబాద్, అక్టోబర్ 12: ప్రముఖ పరుపుల విక్రయ సంస్థ డ్యూరోఫ్లెక్స్..రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే వందల కోట్ల స్థాయిలో పెట్టుబడులు పెట్టిన సంస్థ.. తాజాగా మరో రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్లో మరో ఎక్స్క్లూజివ్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం కంపెనీ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ మోహన్ రాజ్ జగనీవాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీకి సంబంధించిన పరుపులకు డిమాండ్ అధికంగా ఉండటంతో గతేడాది తొలి ఎక్స్క్లూజివ్ సెంటర్ను ప్రారంభించిన సంస్థ..తాజాగా గచ్చిబౌలిలో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన సెంటర్ను ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్ర మార్కెట్ చాలా కీలకమని, ఇక్కడ మార్కెట్లో పరుపులకు అనూహ్యంగా డిమాండ్ పెరిగిందని, ముఖ్యంగా ప్రీమియం పరుపులను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపడంతో మేడ్చల్ వద్ద ఉన్న ప్లాంట్ సామర్థ్యాన్ని రెండింతలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ యూనిట్లో రోజుకు 300 పరుపులు ఉత్పత్తి అవుతుండగా..వచ్చే ఏడాదిన్నరలోగా ఈ సామర్థ్యం 600కి చేరుకోనున్నదని చెప్పారు. అలాగే ఈ యూనిట్లో 150 మంది పనిచేస్తుండగా, ఈ సంఖ్యను కూడా 300కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. మేడ్చల్ వద్ద 1984లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే.
హైదరాబాద్లో ప్రీమియం పరుపులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని నగరంలో మరో మూడు ఎక్స్క్లూజివ్ స్టోర్లను ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించబోతున్నట్లు మోహన్రాజ్ వెల్లడించారు. ఈ ఎక్స్క్లూజివ్ స్టోర్లలో పరుపులు కొనుగోలు చేసిన వారికి ఉచితంగా డెలివరీ చేయడంతోపాటు కస్టమర్ కోరుకుంటున్న విధంగా పరుపులను తయారు చేసి ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.