ప్యారిస్ : ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ గగనతలంలో విహరిస్తూ ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేరవేసే డ్రోన్ ట్యాక్సీలు 2024లో వాణిజ్య సేవలు అందించనున్నాయి. ప్యారిస్ సమీపంలోని పాంటోయిస్ ఎయిర్ఫీల్డ్లో పలు రోటర్లతో కూడిన ఎలక్ట్రిక్ హెలికాఫ్టర్ గగన వీధిలో చక్కర్లు కొట్టింది. వోలోకాప్టర్ అభివృద్ధి చేసిన ఎనిమిది రోటర్లతో భారీ డ్రోన్ను తలపించే టెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ పాంటోయిస్ ఎయిర్ఫీల్డ్ నుంచి ఓ ప్రయాణీకుడితో బయలుదేరి కొద్దిసేపు చక్కర్లు కొట్టింది.
రానున్న 18 నెలల్లో ఎయిర్క్రాఫ్ట్కు తుది మెరుగులు దిద్ది సర్టిఫికేషన్కు సన్నాహాలు చేపడతామని, 2024 నాటికి వాణిజ్య విమానాలు ప్రారంభిస్తామని జర్మన్ కంపెనీ వోలోకాప్టర్ సీఈఓ డిర్క్ హోక్ వెల్లడించారు. ప్యారిస్లో సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ నిర్వహించే సమయానికి డ్రోన్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రయాణీకులతోనే తమ టూ సీటర్ విమానం గగనతలంలోకి వెళ్లేలా పూర్తి ఆటోమేటెడ్గా విమానం సిద్ధం చేయాలని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ దిశగా మౌలిక వసతులు, ఎయిర్స్పేస్ ఇంటిగ్రేషన్, ప్రజామోదం వంటి అంశాల్లో ఇంకా కృషి చేయాల్సి ఉందని అంగీకరించింది.
సంప్రదాయ హెలికాఫ్టర్ కంటే సులభంగా ప్రయాణించేందుకు వీలుగా డిజిటల్ ఫ్లై బై వైర్ సిస్టం, బహుళ రోటర్లు వెసులుబాటు కల్పిస్తాని టెస్ట్ పైలట్ పౌల్ స్టోన్ చెప్పుకొచ్చారు. అర్బన్ ఎయిర్ మొబిలిటీలో అపార అవకాశాలున్నాయని, నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు డ్రోన్ ట్యాక్సీలు మెరుగైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో వోలోకాప్టర్కు లిలియం, జాబీ ఏవియేషన్, ఎయిర్బస్ వంటి పలు కంపెనీల నుంచి పోటీ ఎదురవుతోంది.