ముంబై, మార్చి 12: తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో లాభాల్లోకి వచ్చాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడడైనప్పటికీ బ్లూచిప్ సంస్థల షేర్లను మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఒకదశలో 500 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు ఈ భారీ స్థాయి లాభాలను నిలుపుకోలేకపోయింది. చివరకు 165.32 పాయింట్లు అందుకొని 73,667.96 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ స్వల్పంగా పెరిగి 22,335.70 పాయింట్లు అందుకున్నది. గత రోజు ప్రాఫిట్ బుకింగ్ నుంచి సూచీలు కోలుకున్నాయని, మధ్య-చిన్న స్థాయి స్టాక్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సూచీలు బలపడ్డాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోనుండటం అంతర్జాతీయ మార్కెట్లో సెంటిమెంట్ నిరాశావాదంగా తయారైందన్నారు. కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2.30 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది.