ముంబై, మార్చి 14: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాలను సంతరించుకున్నాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 335.39 పాయింట్లు లేదా 0.46 శాతం పుంజుకొని 73,097.28 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 602.41 పాయింట్లు పెరిగినా.. మదుపరుల లాభాల స్వీకరణతో తగ్గుముఖం పట్టింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 148.95 పాయింట్లు లేదా 0.68 శాతం ఎగిసి 22,100 మార్కును అధిగమిస్తూ 22,146.65 వద్ద నిలిచింది. బుధవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడి నడుమ సెన్సెక్స్ 906, నిఫ్టీ 338 పాయింట్లు పతనమైన విషయం తెలిసిందే. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) రూ.4,595.06 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. కాగా, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చిందని ట్రేడింగ్ నిపుణులు మార్కెట్ సరళిని విశ్లేషిస్తున్నారు. దేశ జీడీపీ అంచనాను వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఫిచ్ రేటింగ్స్ 7 శాతానికి పెంచడం, ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 0.2 శాతానికి దిగిరావడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే రిటైల్ ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్ల కోతలకు దిగవచ్చన్న అంచనాలను వెలిబుచ్చుతున్నారు. ఇప్పటికే ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలపై ఆశాజనకంగా స్పందిస్తున్నదని, అదే జరిగితే ఇక్కడా వడ్డీరేట్లు దిగొస్తాయని చెప్తున్నారు. దీంతో మార్కెట్లకు మరింత ఉత్సాహం లభిస్తుందని, ఆయా వడ్డీరేట్ల ఆధారిత కంపెనీల షేర్లు పరుగులు పెడుతాయని అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్ సూచీలు లాభాల్లో ముగిశాయి. చైనా, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు లాభాల్లోనే కదలాడుతున్నాయి. ఇక బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసిన విషయం తెలిసిందే.
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో మదుపరుల సంపద కూడా మళ్లీ ఎగబాకింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.7,81,631.24 కోట్లు పెరిగి రూ.3,79,98,233.91 కోట్ల (4.59 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. సెన్సెక్స్ షేర్లలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్అండ్టీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి.