ముంబై, ఆగస్టు 16: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలు చివర్లో ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకోగలిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా సూచీలకు దన్నుగా నిలిచాయి. ప్రారంభంలో 369 పాయింట్ల మేర నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివర్లో 137.50 పాయింట్లు లాభపడి 65,539.42 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 30.45 పాయింట్లు అధికమై 19,465 వద్ద స్థిరపడింది. ఆహార పదార్థాల ధరలు భగ్గుమనడం, ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకోవడం మదుపరుల్లో ఆందోళన పెంచింది.
ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలకు చివర్లో గ్లోబల్ మార్కెట్ల వచ్చిన సానుకూల అంశాలు పెరగడానికి దోహదం చేశాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసు హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అల్ట్రాటెక్ సిమెంట్ షేరు 2.43 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు ఎన్టీపీసీ, టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ అండ్ టుబ్రో, మారుతి, విప్రో, ఎస్బీఐలు లాభాల్లో ముగిశాయి. కానీ, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే యుటిలిటీ 1.14 శాతం, రియల్టీ 1.08 శాతం, పవర్ 1.03 శాతం, హెల్త్కేర్, క్యాపిటల్ గూడ్స్, వాహన రంగ షేర్లకు మదుపరుల మద్దతు లభించింది. కానీ, కమోడిటీ, ఆర్థిక సేవలు, టెలికం, బ్యాంకింగ్, మెటల్ రంగ సూచీలు నష్టపోయాయి.