ముంబై, జూన్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు ఆశావాదంగా ఉంటాయన్న సంకేతాలు మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 291.17 పాయింట్లు అందుకొని 77 వేల పైకి చేరుకున్నది. 77,04.07 వద్ద ముగిసింది. చమురు అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఫార్మా రంగ షేర్లకు మదుపర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు పెరిగాయని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. మరో సూచీ నిఫ్టీ సైతం 89.80 పాయింట్లు ఎగబాకి 24,102.90 వద్ద స్థిరపడింది.
దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ మదుపర్లు భారీగా నిధులు తరలించడం, బ్లూచిప్ సంస్థల షేర్లు దూసుకుపోవడం వల్లనే సూచీలు లాభాల్లో కొనసాగాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. సూచీల్లో టెక్ మహీంద్రా షేరు 1.87 శాతం ఎగబాకి టాప్గెయినర్గా నిలిచింది. దీంతోపాటు సన్ఫార్మా 1.39 శాతం, ఇన్ఫోసిస్ 1.29 శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ 1.01 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు, ఏషియన్ పెయింట్స్ 2.15 శాతం నష్టపోగా, టైటాన్ 1.11 శాతం, పవర్గ్రిడ్, ట్రెంట్ షేర్లు ఒక్క శాతం వరకు నష్టపోయాయి. రంగాలవారీగా యుటిలిటీ షేర్లు 1.01 శాతం అందుకోగా, హెల్త్కేర్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఇండస్ట్రియల్స్, ఫోకస్డ్ ఐటీ రంగ షేర్లు లాభపడ్డాయి. కానీ కన్జ్యూమర్ డ్యూరబుల్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు ఢీలాపడ్డాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీగా లాభపడింది. తన అనుబంధ సంస్థయైన రిలయన్స్ జియో ఐపీవోకి రాబోతున్నట్టు ప్రకటించడం మార్కెట్లో సానుకూల ట్రెండ్ను సృష్టించింది. ఇంట్రాడేలో మూడు శాతం వరకు లాభపడిన రిలయన్స్ షేరు మార్కెట్ ముగిసే సమయానికి 1.31 శాతం అందుకొని రూ.1,326.55 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈలోనూ రూ.1,309.50 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.23,275.96 కోట్లు పెరిగి రూ.17,95,158.92 కోట్లకు చేరుకున్నది.