ముంబై, డిసెంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల నుంచి తేరుకుని స్వల్ప లాభాలను అందుకోగలిగాయి. ఉదయం ఆరంభం నుంచీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు.. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో గట్టెక్కాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష జరుగుతున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి అడుగులేశారు. ఈ క్రమంలోనే తీవ్ర ఒడిదుడుకులు చవిచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 33.57 పాయింట్లు లేదా 0.05 శాతం పెరిగి 69,584.60 వద్ద ముగిసింది. అయితే ఒకానొక దశలో మాత్రం 450.47 పాయింట్లు పడిపోవడం గమనార్హం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 19.95 పాయింట్లు లేదా 0.10 శాతం పెరిగి 20,926.35 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్క్యాప్ 1.06 శాతం, స్మాల్క్యాప్ 0.73 శాతం చొప్పున పెరిగాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.