ముంబై, మార్చి 24: మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతో మెటల్, ఎనర్జీ, రియల్టీ స్టాకులు అత్యధికంగా నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా తమ నిధులను తరలించుకుపోవడంతో మదుపరుల సెంటిమెంట్ నీరుగారింది. ఫలితంగా వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 398.18 పాయింట్లు కోల్పోయి 57,527.10 వద్దకు జారుకున్నది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 131.85 పాయింట్లు తగ్గి 16,945.05 వద్ద ముగిసింది. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 462.8 పాయింట్లు, నిఫ్టీ 155 పాయింట్లు కోల్పోయినట్టు అయింది. బజాజ్ ఫిన్సర్వ్ అత్యధికంగా 3.81 శాతం నష్టపోయి టాప్ లూజర్గా నిలిచింది. దీంతోపాటు బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, రిలయన్స్, హెచ్సీఎల్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్లు నష్టపోయాయి. కానీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, విప్రోల షేర్లు లాభాల్లో ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 25 పైసలు తగ్గి 82.45 వద్ద ముగిసింది.