ముంబై, మార్చి 31: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల అండతోపాటు దేశీయ బ్లూచిప్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రిస్ భారీగా లాభపడంతో సూచీలు కదంతొక్కాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి రోజు శుక్రవారం మార్కెట్లు రెండు శాతానికి పైగా లాభపడటం విశేషం. గత పదిహేను రోజుల్లో ఇంతటి స్థాయిలో లాభపడటం కూడా ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్లకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం కూడా మదుపరుల్లో సెంటిమెంట్ను మెరుపరిచింది. దీంతో వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 1,031.43 పాయింట్లు లేదా 1.78 శాతం లాభపడి 58,991.52 పాయింట్లకు చేరుకున్నది. ఇంట్రాడేలో 1,108 పాయింట్లు ఎగబాకి 59 వేల పైకి చేరుకున్నది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 279.05 పాయింట్లు (1.63 శాతం) అందుకొని 17,359.75 వద్ద స్థిరపడింది.
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలతో మదుపరులు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు పెరుగుతుండటం, రాజకీయ అస్థిరత పరిస్థితుల కారణంగా మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో 2022-23లో రూ.5.86 లక్షల కోట్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.5,86,605.38 కోట్లు కోల్పోయి రూ.2,58,19,896 కోట్లకు తగ్గింది.
గత ముగింపు: 57,960
ప్రారంభం: 58,274
గరిష్ఠం: 59,068
కనిష్ఠం: 58,274
ముగింపు: 58,991