Stock Market | ముంబై, మార్చి 18: తీవ్ర ఒడిదొడుకుల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు లాభాల్లోకి వచ్చాయి. వచ్చే సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయంటూ వచ్చిన సంకేతాలు మదుపరులను అమ్మకాలవైపు నడిపించాయి. ఫలితంగా ప్రారంభంలో భారీగా విక్రయాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు చివర్లో బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుతో తిరిగి లాభాల్లోకి రాగలిగాయి.
సెన్సెక్స్ 104.99 పాయింట్లు పెరిగి 72,748.42 పాయింట్ల వద్దకు చేరుకోగా, మరో సూచీ నిఫ్టీ సైతం 32.25 పాయింట్లు అందుకొని 22,055.70 వద్ద స్థిరపడింది. మెటల్, ఆటో, కమోడిటీ రంగ షేర్లు లాభాల్లో ముగియగా..ఐటీ, టెక్నాలజీ రంగ షేర్లు పతనం చెందాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.5 శాతం బలపడగా, టాటా స్టీల్ 5 శాతం, మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటర్స్, యాక్సిస్ బ్యాంక్, సన్ఫార్మా, మారుతి షేర్లు లాభాల్లో ముగిశాయి.
ఆదానీ గ్రూపు షేర్ల పతనం
అమెరికా లంచం కేసులో విచారణ వేగవంతం అవుతున్నట్లు వచ్చిన వార్తలు అదానీ గ్రూపు షేర్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. అదానీ టోటల్ గ్యాస్ 4.35 శాతం పతనమవగా, అదానీ ఎనర్జీ సొల్యుషన్స్ షేర్లు 3.40 శాతం, అంబుజా సిమెంట్ 2.81 శాతం, ఏసీసీ 2.43 శాతం నష్టపోయాయి.