ముంబై, ఫిబ్రవరి 1: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో డెరివేటివ్లపై సెక్యూరిటీ ట్రాన్స్క్షన్ ట్యాక్స్ను 150 శాతం వరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం మదుపరులను ముంచింది. ఉదయం నుంచి తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలు బడ్జెట్లో ఎస్టీటీని పెంచుతున్నట్టు ప్రకటించగానే ఒక్కసారిగా కుప్పకూలింది. ఒక దశలో 2 వేల పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 80 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది.
చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1,546.84 పాయింట్లు లేదా 1.88 శాతం పతనం చెంది 80,722.94 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 495.20 పాయింట్లు లేదా 1.96 శాతం కోల్పోయి 25 వేల పాయింట్ల దిగువకు 24,825.45 వద్దకు పతనం చెందింది. ఇంట్రాడేలో నిఫ్టీ 748.90 పాయింట్లు లేదా 2.95 శాతం క్షీణించింది. బడ్జెట్ రోజు మోదీ హయాం లో ఈ స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి. అలాగే ఫిబ్రవరి 1, 2020న కూడా సెన్సెక్స్ 987.96 పాయింట్లు లేదా 2.42 శాతం కోల్పోయింది.
బ్యాంకింగ్ షేర్ల అధోగతి
బ్యాంకింగ్ రంగ షేర్లు కుప్పకూలాయి. సార్వత్రిక బడ్జెట్లో బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఈ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 6.60 శాతం తగ్గి టాప్ లూజర్గా నిలిచింది. దీంతోపాటు యూనియన్ బ్యాంక్ షేరు కూడా 6.31 శాతం పతనం చెందగా, అలాగే ఎస్బీఐ 5.61 శాతం, కెనరా బ్యాంక్ 4.38 శాతం, పీఎన్బీ 2.92 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.33 శాతం చొప్పున క్షీణించాయి. వీటితోపాటు ఐడీఎఫ్సీఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏయూ బ్యాంక్, కొటక్ బ్యాంక్ షేర్లు కూడా తగ్గుముఖం పట్టాయి.
9.40 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మదుపరులు భారీగా సంపదను కోల్పోయారు. సార్వత్రిక బడ్జెట్ సందర్భంగా ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించిన ఆదివారం రోజు వారికి నిరాశే ఎదురైంది. డెరివేటివ్లపై ఎస్టీటీని 150 శాతం పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మదుపరుల లాభాలకు గండికొట్టింది. దీంతో రూ.9.40 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.9,40, 581.75 కోట్లు కరిగిపోయి రూ.4,50, 61,658.60 కోట్లు(4.90 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది.